
పాకిస్థాన్ తో సహా మొత్తం పన్నెండు దేశాల పర్యాటకులపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆంక్షలు విధించింది. ఆయా దేశాలకు సంబంధించి కొత్త వీసాల జారీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం వర్తిస్తుందని యూఏఈ విదేశీ వ్యవహారాల కార్యాలయం వెల్లడించింది. అయితే ఇప్పటికే జారీ అయిన వీసాలకు ఈ నిషేధం వర్తించదని అధికారులు వివరించారు. నిషేధం అమలయ్యే దేశాల్లో పాక్ సహా టర్కీ, ఇరాన్, యెమెన్, సిరియా, ఇరాక్, సోమాలియా, లిబియా, కెన్యా, అఫ్గానిస్తాన్ కూడా ఉన్నాయి.
కొవిడ్-19 రెండోసారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎమిరేట్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. తమ ప్రభుత్వం ఆ దేశ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పాక్ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్ చౌధరి ప్రకటించారు. వాణిజ్య, పర్యాటక, ట్రాన్సిట్ తదితర పలు వీసాల్లో వేటికి ఈ నిషేధం వర్తించేదీ ఇంకా స్పష్టం కాలేదు. గతంలో కూడా యూఏఈ పాక్ విమానాలపై జులై 3 వరకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.





