
కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబయి పేలుళ్ల కుట్రలో ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉగ్రవాద దాడులకు సంబంధించిన రెండు కేసుల్లో పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు అతడికి పదేళ్ల పాటు శిక్ష విధించింది. జమాత్ ఉల్ దవా (జేయూడీ) సంస్థ చీఫ్ గా ఉన్న సయీద్ 2008 ముంబయి పేలుళ్ల వెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న కేసులో ఇప్పటికే 11 ఏళ్లు జైలు శిక్ష విధించగా.. అతడు ప్రస్తుతం లాహోర్లోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా హఫీజ్ తో పాటు మరో నలుగురికి పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఉగ్ర సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న ఆరోపణలపై అతడితో పాటు జేయూడీ సభ్యులపై పాక్ ఉగ్ర నిరోధక విభాగం దాదాపు 41 కేసులు పెట్టగా…. వాటిల్లో రెండు కేసుల్లో గురువారం శిక్ష పడింది. లష్కరే తోయిబాకు ముందుండి అన్నీ చూసుకొనే జేయూడీ చీఫ్ సయీద్ ఐరాస ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలోనూ ఉన్నాడు. అంతేకాకుండా అమెరికా అతడి తలపై 10 మిలియన్ డాలర్ల పారితోషికం ప్రకటించిన విషయం తెలిసిందే. 2008 ముంబయి పేలుళ్ల ఘటనలో 166 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా….. వందలాది మంది క్షతగాత్రులైన విషయం తెలిసిందే.