
పూర్తి దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన కొవిడ్-19 పరీక్షా కిట్లను భారత్ కు చెందిన పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూపు విడుదల చేసింది. తమ కరోనా నిర్ధారణ కిట్లు దేశవ్యాప్తంగా డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తాయని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి గిరీశ్ కృష్ణమూర్తి తెలిపారు. ప్రభుత్వ అనుమతి పొందిన తమ పరీక్షా విధానంలో అంతిమ ఫలితాలు కేవలం గంటన్నర వ్యవధిలోనే వెలువడతాయని ఆయన వివరించారు. చెన్నైలో ఉన్న సంస్థ కర్మాగారంలో త్వరలోనే ఉత్పత్తి మొదలు కానుందని ఆయన వెల్లడించారు. ఈ కర్మాగారానికి నెలకు పదిలక్షల టెస్ట్ కిట్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నట్టు ఆయన తెలిపారు.
ప్రస్తుతం వాడుతున్న వివిధ కరోనా నిర్ధారణ విధానాలతో పోలిస్తే.. తమ కొత్త విధానం ప్రభావవంతం, సులభమని.. పెద్ద ఎత్తున వాడేందుకు అనువుగా ఉంటాయని టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ లిమిటెడ్ తెలిపింది. ఈ సదుపాయాన్ని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు తాము దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఆస్పత్రులు, ల్యాబ్లతో భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.





