
లడ్డాఖ్ సరిహద్దు ఉద్రిక్తతలతో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరు దేశాధినేతలు తొలిసారి ముఖాముఖీ కలుసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెల 10న జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) వార్షిక సదస్సులో భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వం వహించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సదస్సులో ప్రధాని మోడీ.. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఆన్లైన్ ద్వారా ముఖాముఖి చర్చలో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అధ్యక్షత వహించనున్నారు. చైనా ప్రతినిధుల బృందానికి జిన్పింగ్ నేతృత్వం వహిస్తున్నారు.
భారత్-చైనా మధ్య లడ్డాఖ్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సరిహద్దు ఘర్షణలతో గత ఆరు నెలలుగా రెండు దేశాల నడుమ ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే రెండు దేశాలు పలుమార్లు దౌత్య, సైనిక పరమైన చర్చలు జరిపాయి. అయినప్పటికీ పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, జిన్పింగ్ తొలిసారి ముఖాముఖీ అయ్యే అవకాశం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ నెల 17న జరిగే బ్రిక్స్ సమావేశంలోనూ, నవంబరు 22న జరిగే జీ20 సదస్సులోనూ మోడీ, జిన్పింగ్ వర్చువల్గా కలుసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.





