
జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హతమయ్యాడు. మరో ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ సంవత్సరం మే నెలలో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ కమాండర్గా ఉన్న రెయాజ్ నైకూ హతమయ్యాడు. అప్పటినుంచి డాక్టర్ సైఫుల్లానే హిజ్బుల్కు నేతృత్వం వహిస్తున్నాడు. అనేక దాడుల్లో ఉన్న సైఫుల్లా భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. తాజా ఎన్కౌంటర్లో భద్రతా దళాలు అతన్ని మట్టుబెట్టాయి.
ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో..జమ్మూ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సమయంలో హిజ్బుల్ కమాండర్తోపాటు మరో ఉగ్రవాది పోలీసులపైకి కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో భద్రతా దళాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో హిజ్బుల్ కమాండర్ మృతి చెందగా మరో ఉగ్రవాదిని ప్రాణాలతో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి ఆయుధాలు, పేలుడు పదర్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.





