
విజయవాడలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ల జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు వాల్మీకి, భరతమాత, సర్దార్ వల్లభాయ్ పటేల్ ల చిత్రపటాలకు పుష్పమాలలను సమర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ అడవులలో దారి దోపిడీ దొంగగా జీవిస్తూ ఉండిన వాల్మీకి నిషాద పక్షి విషాదాన్ని చూచి విచలితుడై రామాయణ మహాకావ్యాన్ని రచించాడని, యుగాలు ఎన్ని గడిచినా రామాయణ మహా కావ్యం ప్రజల హృదయాలలో ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుందని, సమస్త మానవాళికి జీవన విలువలను, జీవన ఆదర్శాలను బోధిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.

అలాగే 550 పైగా ఉన్న స్వతంత్ర సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడంలో కీలక భూమిక పోషించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరోదాత్తత, పట్టుదల, ఆత్మస్థైర్యం, దేశభక్తి ఎన్ని తరాలు గడిచినా భారతీయులందరికీ ఆదర్శనీయము, ఆచరణీయము అని వక్తలు ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో చైతన్య వేదిక సభ్యులు శ్రీ కే రాము, భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కార్యదర్శి శ్రీ టి. కోదండరామయ్య, నగర బిజెపి నాయకులు ఆర్ముగం, ఏబీవీపీ కార్యకర్తలు శ్రీ సుబ్బరాజు, శేషు, సత్య తదితరులు పాల్గొన్నారు.





