News

భాజపాలో చేరిన నటి ఖుష్బూ

779views

ప్రముఖ నటి ఖుష్బూ సుందర్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ ఉదయమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆమె.. మధ్యాహ్నం కాషాయ కండువా కప్పుకొన్నారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌తో పనిచేసిన ఆమెను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తూ హస్తం పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే తాను ‘హస్తాన్ని వీడుతున్నట్టు ఖుష్బూ వెల్లడించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపారు. పార్టీలో కొంతమంది తనను అణచివేయాలని చూస్తున్నట్లు లేఖలో ఖుష్బూ ఆరోపించారు.

డీఎంకేతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఖుష్బూ 2014లో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి అధికార ప్రతినిధిగా కొనసాగుతూ వచ్చారు. అయితే ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి మద్దతు తెలుపుతూ ఖుష్బూ ట్వీట్‌ చేశారు. అప్పటి నుంచే ఆమె పార్టీ మారతారనే ఊహాగానాలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఖష్బూ పార్టీ మారడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ఆమెకు విశేష ఆదరణ ఉంది. దీంతో ఆమె చేరిక తమకు కలిసొచ్చే అంశమని భాజపా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 మోడీ నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉంది : ఖుష్బూ

మోడీ సరైన దిశలోనే దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, ప్రధాని చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితురాలినై పార్టీలో చేరానని ఖుష్బూ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యా పాలసీని సమర్థించిన ఖుష్బూ మోడీ నాయకత్వంలో పని చేయడం గర్వ కారణమని అన్నారు. ఇక త్వరలో జరగబోతున్న తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ తరపున శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.