News

భక్తులకు ధర్మ దర్శన సౌకర్యం కల్పించండి

396views

తిరుమల తిరుపతి సంరక్షణ సమితి చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం భైరాగిపట్టెడలోని వెంకటకృప నిలయం నందు శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి TTSS జిల్లా అధ్యక్షులు హరికృష్ణ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ లు డాక్టర్ ఎం సుందర మూర్తి, శ్రీ కె శ్యాంప్రసాద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ హరికృష్ణ  మాట్లాడుతూ కరోనా కారణంగా అనేక మాసాల పాటు భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. గత కొద్దిరోజులుగా రోజుకి 10 వేల మంది చొప్పున 300 రూపాయల టిక్కెట్లపై  దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారన్నారు.

కోవిడ్ నియమ నిబంధనల మేరకు స్వామి దర్శన అవకాశం కల్పిస్తున్న భక్తులలో కనీసం 50 % మందికి ధర్మ దర్శనం ద్వారా స్వామివారి దర్శనం కల్పించాలని శ్రీ హరికృష్ణ టిటిడి ని కోరారు. శ్రీవారి భక్తులకు ధర్మదర్శనం చేసుకునే భాగ్యం కల్పించకపోవడం బాధాకరమన్నారు. తిరుమలకు నడక దారిన వచ్చే భక్తులకు ధర్మ దర్శన సౌకర్యం కల్పించాలని ఆయన టీటీడీని కోరారు.

అదేవిధంగా తిరుమల కొండపై అనాదిగా వివిధ గిరిజన తెగలకు చెందిన భక్తులు నివసిస్తూ వెంకన్న స్వామిని సేవిస్తూ ఉండేవారని, వారు నక్కల (షికారి) కులానికి చెందిన గిరిజనులని, ఆలయానికి దగ్గరలో పూసలు, బొమ్మలు వంటి వస్తువులను అమ్ముకుంటూ జీవనం సాగించే వారిని తెలిపారు. టీటీడీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణదశలో వీరికి షాపులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అయిన తర్వాత అందరికీ షాపులు కేటాయించినప్పటికీ ఈ నక్కల (షికారి) వారికి మాత్రం షాపులు కేటాయించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ నక్కల (షికారి) కులానికి చెందిన మొత్తం 17 కుటుంబాల వారికి వెంటనే షాపులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

టిటిడి నిధులను నిర్దిష్ట కాలపరిమితితో షెడ్యూల్డు బ్యాంకులలోనే జమచేయాలని తెలిపారు. ఎక్కువ వడ్డీ వస్తుందన్న నెపంతో TTD నిధులను దారి మళ్ళించడం సరైన నిర్ణయం కాదని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని TTSS నాయకులు డిమాండ్ చేశారు.

టిటిడి విద్యాసంస్థలలో ఎక్కువమంది కాంట్రాక్టు ఉద్యోగస్తులే ఉన్నారని, అర్హత కలిగిన వ్యక్తులతో హిందూ మతస్తులతోనే రెగ్యులర్ ప్రాతిపదికపై ఉపాధ్యాయులను, ఉపాధ్యాయేతర సిబ్బందిని నియమించాలని TTSS డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

సమావేశంలో తిరుపతి పట్టణ అధ్యక్షులు డా ఎఎ శ్రీదర్, జిల్లా కార్యదర్శి ఎస్ సుబ్బరామిరెడ్డి తిరుపతి పట్టణ కార్యదర్శి పి.ధనంజయ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి టి టి ఎస్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో TTD మాజీ బోర్డు సభ్యులు జి.భానుప్రకాష్ రెడ్డి, టిటిఎన్ఎస్ నగర సహ కార్యదర్శి రాటకొండ విశ్వనాథ్, ప్రచార కార్యదర్శి బి. భరత్ కుమార్, కిరణ్ కుమార్ జైన్, పెరుగు వెంకటేష్, ఎస్.సుమన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.