
గతకొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న భారత్-చైనా సరిహద్దుల్లో వాతావరణం మరింత వేడెక్కినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సో సరస్సు సమీపంలో ఇరు దేశాల బలగాలు గాల్లోకి హెచ్చరికల కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే, తొలుత భారతే కాల్పులు జరిపిందంటూ చైనా పశ్చిమ థియేటర్ కమాండర్ బుకాయించే ప్రయత్నం చేశారు. దానికి ప్రతిస్పందనగానే తాము కాల్పులు జరపాల్సి వచ్చిందంటూ తొలి నుంచి అనుసరిస్తున్న తమ దురుసు వైఖరిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
భారత్ ఎటువంటి కాల్పులూ జరుపలేదు :
భారత్-చైనా సరిహద్దులో తూర్పు లద్దాఖ్లో సమీపంలో గాల్లోకి కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో భారత సైన్యం తాజా ప్రకటన చేసింది. ‘ వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు సంప్రదింపులు, చర్చలకు భారత్ కట్టుబడి ఉంది. ఈ సమయంలోనే చైనా బలగాలు రెచ్చగొట్టే చర్యలతో పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. చైనా ఎంతగా కవ్వించినా భారత్ సమయమనం పాటిస్తోంది. ఇలాంటి సమయంలో భారత సైన్యం వాస్తవాధీనరేఖ వెంబడి అతిక్రమణకు పాల్పడలేదు. అంతేకాకుండా కాల్పులు వంటి చర్యలకు భారత సైన్యం దిగలేదు’ అని ఈ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది.
ప్రపంచానికి చైనా అబద్దాలు చెబుతోంది :
సైనిక, దౌత్య, రాజకీయ స్థాయిలో చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఒప్పందాలను నిర్లక్ష్యంగా ఉల్లంఘిస్తూ చైనా సైన్యం దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా జరిగిన ఘటనలో పీఎల్ఏ దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యాన్ని బెదిరించే ధోరణితో గాల్లో కాల్పులకు తెగబడ్డాయి. అంతేకాకుండా సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ప్రపంచానికి మాత్రం అబద్దాలు చెబుతోంది. ఈ సమయంలో చైనా సైన్యం ఎంత తీవ్రంగా రెచ్చగొట్టే చర్యలు చేపట్టినా, భారత సైన్యం మాత్రం సంయమనం పాటించి శాంతి మార్గంలోనే ఉందని తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. అయితే, దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో ఎలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని భారత రక్షణశాఖ మరోసారి స్పష్టం చేసింది.





