News

పాక్ లో గురుద్వారాను మశీదుగా మార్చే కుట్ర

734views

పాకిస్థాన్‌లోని ప్రముఖ నగరం లాహోర్‌లో ఉన్న సిక్కుల పవిత్ర స్థలమైన ఓ గురుద్వారాను మసీదుగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుయుక్తులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ దిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌కు సోమవారం లేఖ అందజేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

లాహోర్‌లోని నౌలాఖా బజార్‌లో ఉన్న ‘షహీదీ ఆస్థాన్‌’ గురుద్వారాను అక్కడి మత శక్తులు మసీదుగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నాయి. ఈ గురుద్వారా దగ్గరే భాయ్‌ తరుసింగ్‌ జీ అమరుడైనట్లు సిక్కులు భావిస్తారు. అయితే దీన్ని మసీదు ‘షహీద్‌ గంజ్‌’గా అక్కడి మతశక్తులు వాదిస్తున్నాయి. ఈ కుట్రలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్‌.. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీన్ని తీవ్ర ఆందోళనకరమైన విషయంగా పరగణిస్తున్నామని స్పష్టం చేసింది. పాక్‌లో ఉన్న మైనారిటీల రక్షణ, వారి మత స్వేచ్ఛకు కట్టుబడి ఉండాలని కోరింది.

ఈ ఘటనపై అకాళీ దళ్‌ అధికార ప్రతినిధి, దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు మంజీందర్‌ సింగ్‌ సీర్సా తీవ్రంగా మండిపడ్డారు. పాక్‌ మతాధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గురుద్వారాను మసీదుగా మార్చే కుట్రల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులంతా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అతివాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ట్విటర్‌ వేదికగా కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.