
చైనా ఏక ఛత్రాధిపత్యాన్ని పక్కకునెట్టి ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించే సత్తా భారత్కే ఉందని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా భారత్ తన మార్కెట్ను మరింత విస్తృతం చేయాలని సూచించారు. అమెరికా కంపెనీలు భారత్లో భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు, వాణిజ్యం చేసేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సదస్సులో పాంపియో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సదస్సులో ఆయన ప్రసంగించారు.
అమెరికా సహా ప్రపంచదేశాల నమ్మకాన్ని సంపాదించిన భారత్.. చైనాను పక్కకునెట్టి గ్లోబల్ వాణజ్య శక్తిగా ఎదగగలదని విశ్వాసం వ్యక్తంచేశారు. ఫలితంగా ప్రపంచ దేశాలు చైనా కంపెనీలపై ఆధారపడడం తగ్గుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా టెలీకమ్యూనికేషన్, వైద్య సామగ్రి సహా పలురంగాల్లో ప్రపంచదేశాల అవసరాలను తీర్చే సామర్థ్యం భారత్కు ఉందన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి సవాళ్లు ఎదురవుతున్న వేళ.. భారత్, అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పాంపియో అభిప్రాయపడ్డారు.
అంతకుముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సులో ప్రసంగించారు. భారత్లోని ఆరోగ్య సంరక్షణ, మౌలిక, రక్షణ, ఇంధన, వ్యవసాయ, బీమా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కంపెనీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు.





