News

చైనాకు చెందిన మరో 11 భారీ కంపెనీలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు

379views

చైనాకు చెందిన మరో 11 భారీ కంపెనీలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. షిన్‌జియాంగ్‌లోని వీగర్‌ ముస్లింలపై చైనా ప్రభుత్వం జరుపుతున్న అణచివేతలో ఈ కంపెనీలకూ భాగస్వామ్యం ఉందని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే వీటిపై కఠిన ఆంక్షలు విధిస్తున్నామని తెలిపింది. తాజా నిర్ణయంతో ఆయా కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేనిదే అమెరికాకు చెందిన కంపెనీలతో ఎలాంటి క్రయవిక్రయాలు జరపలేవు.

చైనాలోని కొన్ని కంపెనీలు వీగర్స్‌తో పాటు మరికొంత మంది ముస్లిం మైనారిటీలచేత బలవంతంగా కంపెనీల్లో పనిచేయించుకుంటున్నాయని అమెరికా కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆరోపించింది. వీటిలో చాలా వరకు వస్త్ర పరిశ్రమలు ఉన్నట్లు పేర్కొంది. వీటిలో రెండు కంపెనీలు ఓ అడుగు ముందుకేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారిపై బలవంతంగా జన్యుపరమైన విశ్లేషణలు సైతం జరుపుతున్నాయని ఆరోపించింది. మొత్తం షిన్‌జియాంగ్‌లో 37 కంపెనీలు వీగర్స్‌ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని తెలిపింది.

”వీగర్‌ ముస్లింలను చైనా ప్రభుత్వం అణచిచేస్తోంది. అందులో భాగంగా వారిచే బలవంతంగా పనిచేయించుకోవడం, అక్రమంగా డీఎన్‌ఏను సేకరించి వాటిని విశ్లేషించడం చేస్తున్నారు. అమెరికా వనరుల్ని అలాంటి కంపెనీలు వినియోగించుకోకుండా నిలువరిస్తాం” అని అమెరికా కామర్స్‌ సెక్రటరీ విల్బర్ రాస్‌ ప్రకటించారు. ఆంక్షలు విధించిన జాబితాలో.. అమెజాన్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రముఖ కంపెనీలకు సరఫరాదారుగా ఉన్న నన్‌చాంగ్‌ ఓ-ఫిల్మ్‌ టెక్‌, చైనా ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధాలున్న బీజింగ్‌ జీనోమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి బడా కంపెనీలుండడం గమనార్హం.

గతంలోనూ చైనాకు చెందిన అనేక కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. కొన్ని సంస్థలు నేరుగా చైనా సైన్యం ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. అలాగే హువావే టెక్నాలజీస్‌, జెడ్‌టీఈ కార్పొరేషన్‌పై కూడా అమెరికా ‘ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌’ నిషేధం విధించింది. ఈ కంపెనీలు చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ, చైనా సైన్యం, నిఘా విభాగాలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాయని ఆరోపించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.