News

తెలంగాణలో మావోయిస్టుల కదలికలు

490views

తెలంగాణలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. వివిధ జిల్లాల్లోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. బలగాలతో ఎక్కడికక్కడ కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఈనెల 12న ఆసీఫాబాద్‌ జిల్లా తిర్యాణి అడవుల్లో పలువురు మావోయిస్టు సభ్యులు తప్పించుకు పోయారు. మళ్లీ 15న తొక్కిగూడెంలోనూ ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకున్నారు. అయితే, ఎదురు కాల్పుల సమయంలో దొరికిన డైరీలో కీలక అంశాలు తెలిసినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు 600 మంది పోలీసు బలగాలతో తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కీలక నేత మైలారపు అడెల్లు సహా మరో ఏడుగురు అడవిలో ఉన్నట్టు భావిస్తున్నారు.

ఆసిఫాబాద్‌లో పరిస్థితిని డీజీపీ స్వయంగా సమీక్షించారు. ఇప్పటికే తిర్యాణి అటవీప్రాంతాన్ని పోలీసులు అష్టదిగ్భందనం చేశారు. మావోయిస్టులు లొంగిపోతే చట్ట ప్రకారం సహకరిస్తామని కుమ్రుంభీం జిల్లా ఎస్పీ విష్ణువారియర్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.