
దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. దిల్లీలోని 7 లోక్కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి చేరుకున్న అమిత్ షా దేశంలో కరోనా తీవ్రత, లాక్డౌన్ తదితర అంశాలపై మోదీతో చర్చించినట్లు సమాచారం. నిన్న రాత్రి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన అమిత్ షా లాక్డౌన్పై వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం జరిగిన ఈ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. గడిచిన 24గంటల్లో దేశంలోనే అత్యధికంగా 7467 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీలో కొవిడ్ మహమ్మారి కట్టడికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే అంశంపై కీలకంగా చర్చ జరిగినట్టు సమాచారం. లాక్డౌన్పై తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశాన్ని రేపు ప్రకటించే అవకాశం ఉంది.
ఆర్థిక కార్యకలాపాలను అనుమతిస్తూ లాక్డౌన్ను కొనసాగిస్తే మంచిదని పలువురు సీఎంలు అమిత్ షాతో చెప్పినట్టు తెలుస్తోంది. సోమవారం నుంచి ఎలా ముందుకెళ్లాలనే దానిపై సీఎంలు తమ అభిప్రాయలు చెప్పారు. జూన్ 1 నుంచి ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై గత కొన్ని రోజులుగా ప్రధాని కార్యాలయం (పీఎంవో) లాక్డౌన్ తీరును సమీక్షిస్తోంది.
మరోవైపు, అమిత్ షాతో మాట్లాడిన అనంతరం లాక్డౌన్ అంశంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. లాక్డౌన్ను మరికొన్ని వారాల పాటు పొడిగిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కేంద్రం మరో 15 రోజులు లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే, తమ రాష్ట్రానికి కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. భౌతిక దూరం నిబంధనలతో 50శాతం సామర్థ్యంతో పనిచేసేందుకు రెస్టారెంట్లను అనుమతించాలని కోరానన్నారు. చాలా మంది ప్రజలు జిమ్లను కూడా పునఃప్రారంభించాలని కోరుకుంటున్నారని సావంత్ తెలిపారు. ఇప్పటికే కొనసాగుతున్న లాక్డౌన్ -4 ఆదివారంతో ముగుస్తుండటంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది.
Source : Enadu





