
‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20లక్షల 97వేల కోట్లతో ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ భాగాలుగా ప్యాకేజీ కేటాయింపులను వివరించారు. బుధవారం ప్రకటించిన తొలి ప్యాకేజీలో(పార్ట్-1) లో 5,94,550కోట్ల విలువైన ఉద్దీపనలు ప్రకటించారు. పార్ట్-2లో 3,10,000 కోట్లు, పార్ట్-3లో 1,50,000 కోట్లు, పార్ట్-4,5లలో 48,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇవన్నీ కలిపి రూ. 11,02,650కోట్లు అవుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇదివరకే ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా రూ 1,92,800కోట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఉద్దీపనల మొత్తం రూ 8,01,603కోట్ల కలిపి 9,94,403కోట్లు గా లెక్కకట్టారు. ఇలా పలు విడతల్లో ప్రకటించిన ప్యాకేజీ మొత్తం విలువ రూ. 20,97,053కోట్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.





