
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బామరాగఢ్ తాలూకా కోటిపేంకే పోలీసు స్టేషన్ పరిధిలోని కోపసి గ్రామ అటవీ ప్రాంతంలో పోలీసులు, మవోయిస్టులకు ఆదివారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టు ఏరివేత దళానికి చెందిన సీ-60 పోలీసు దళం గాలింపు నిర్వహిస్తుండగా మావోయిస్టులు మందుపాతరతో పేలుడు నిర్వహించారు. అనంతరం కాల్పులు మొదలుపెట్టారు. దీంతో ప్రతిఘటించిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో పోలీసు ప్రత్యేక దళానికి చెందిన ఎస్సై గానాజీ ఓన్మానే, కానిస్టేబుల్ కిషోర్ ఆత్రం మృతి చెందారు. మరో ఎస్సై పి.రాజు, కానిస్టేబుళ్లు గంగులు, దసరుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులతో పాటు గాయాలైన వారిని హెలికాప్టర్లో జిల్లా కేంద్రంలోని గడ్చిరోలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ అజయ్కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.





