
దేశవ్యాప్తంగా స్వస్థలాలకు తరలివెళ్తున్న వలస కార్మికులను ఆపడం లేదా పరిస్థితిని సమీక్షించడం తమ వల్ల సాధ్యం కాదని సుప్రీం కోర్టు తెలిపింది. దీనిపై ప్రభుత్వమే సరైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ని విచారించేందుకు కోర్టు నిరాకరించింది. దీనిపై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
దీనిపై కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వలస కూలీలంతా తమ స్వస్థలాలకు చేరేందుకు ప్రయాణ సౌకర్యం కల్పించామని కోర్టుకు తెలిపారు. అయితే, వారి వంతు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుందని వివరించారు. అలా కాకుండా కూలీలు కాలినడకన బయలుదేరితే ప్రభుత్వం ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. బలవంతంగా వారిని ఆపేందుకు ప్రయత్నిస్తే ప్రతికూల పరిణామాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. వివిధ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి ఒక్కరికీ తమ స్వస్థలాలకు చేరుకునే అవకాశం వస్తుందని వివరించారు. ఈ విచారణ సందర్భంగా వివిధ సందర్భాల్లో వలస కూలీలు మరణించిన ఉదంతాల్ని పిటిషనర్ వ్యాజ్యంలో ప్రస్తావించారు. కొందరు కూలీలు కిలోమీటర్ల కొద్దీ నడిచి, ట్రాకుల మీద నిద్రపోయి, ఘోర రైలు ప్రమాదానికి గురైన విషయాన్ని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రైల్వే ట్రాకుల మీద నిద్రపోతుంటే ఆ ప్రమాదాన్ని ఎలా ఆపగలం? అంటూ సందేహం వ్యక్తం చేసింది. దీనిపై రాష్ట్రాలే సరైన కార్యాచరణతో ముందుకు సాగాలని హితవు పలికింది.
లాక్డౌన్ కారణంగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడంతో వలస కూలీలకు పని లేకుండా పోయింది. దాంతో వారు నగరాల్లో ఉండలేక సొంతూరు దారి పట్టారు. వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రమాదాల బారిన పడుతూ, ప్రాణాలు కోల్పోతున్నారు. వారిని సొంత రాష్ట్రాలకు చేర్చడానికి కేంద్రం శ్రామిక రైళ్లను నడుపుతున్నా వారి నడక మాత్రం ఆగడం లేదు.





