
ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి అనేక మార్గాలను అన్వేషించారు నిర్భయ దోషులు. కానీ, వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు న్యాయమే గెలిచింది. ఈరోజు ఉదయం 5:30 గంటలకు ఉరికంభం ఎక్కారు. అయితే, చివరి క్షణాల్లో ఆ నలుగురు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసినట్లు సమాచారం. సంబంధిత అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..
శిక్ష నుంచి తప్పించుకోవడానికి నలుగురు దోషులు చివరి వరకు చేసిన ప్రయత్నాల్ని హైకోర్టు తోసిపుచ్చిన రెండు గంటల్లోపే ఉరిశిక్ష అమలు చేశారు. దానికంటే ముందు నిబంధనల ప్రకారం వారికి ఉన్న అన్ని అవకాశాల్నీ అధికారులు కల్పించారు. గరువారం రాత్రి నుంచే జైల్ని లాక్డౌన్లో ఉంచారు.
నిబంధనల ప్రకారం ఉరి తీయడానికి రెండు గంటల ముందు అంటే 3:30 గంటలకు దోషులను నిద్ర లేపడానికి వెళ్లారు. కానీ, అప్పటికి వారు మేల్కొనే ఉన్నారు. రాత్రంతా వారు మెలకువతోనే ఉన్నట్లు సమాచారం. స్నానం చేయమని చెప్పినా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తర్వాత అల్పాహారం అందించినా నిరాకరించారు. అనంతరం వారికి వైద్యుడు పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగానే ఉన్నట్లు తేల్చారు. ఇక వారి చివరి నడక ఉరికంభం వైపు సాగింది. ఈ మధ్యలో దోషి ముకేశ్ క్షమించమని జైలు అధికారుల్ని ప్రాధేయపడ్డట్లు సమాచారం. కానీ, అధికారులు వారి కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తలారి పవన్ జల్లాద్ నలుగురు దోషుల్ని నిబంధనల ప్రకారం ఉరితీశారు. 30 నిమిషాల పాటు వారి మృతదేహాల్ని అలాగే వేలాడదీశారు. ఆ సమయంలో కేవలం ఐదుగురు మాత్రమే ఆ ప్రదేశంలో ఉన్నారు. వీరిలో జైల్ సూపరింటెండెంట్, డిప్యుటీ సూపరింటెండెంట్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, అక్కడి జైలు సిబ్బందిలో మరొకరు ఉరితీత అమలును పర్యవేక్షించారు.
జైల్లో ఉన్న సమయంలో పవన్, వినయ్, ముకేశ్ కూలీ పనిచేశారు. అందుకు వారికి చెల్లించాల్సిన డబ్బును అధికారులు కుటుంబసభ్యులకు అందజేయనున్నారు. అక్షయ్ మాత్రం ఎలాంటి పనిచేయలేదని తెలుస్తోంది. దోషులకు సంబంధించిన వస్తువుల్ని కూడా కుటుంబసభ్యులకే అప్పగించనున్నారు.





