News

గురుద్వారా బయట కాల్పులు.. ఇటలీలో ఇద్దరు భారతీయుల మృతి

58views

ఇటలీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైశాఖి పండుగ వేడుకల సందర్భంగా ప్రార్థనల కోసం గురుద్వారాకు వచ్చిన ఇద్దరు భారతీయులను దుండగుడు కాల్చి చంపాడు. బెర్గామో ప్రావిన్స్‌లోని కోవో పట్టణంలో ఈ విషాదం జరిగింది. ప్రార్థనలు ముగించుకుని గురుద్వారా నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

మృతులను కోవో పట్టణ నివాసి రగిందర్ సింగ్ (48), సమీపంలోని అగ్నడెల్లోకు చెందిన గుర్మిత్ సింగ్ (48)గా గుర్తించారు. గురుద్వారా ముందున్న స్క్వేర్‌ వద్దకు వచ్చిన ఓ ఆగంతకుడు, వారిపై కాల్పులు జరిపి కారులో పరారైనట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఘటనా స్థలం నుంచి పోలీసులు సుమారు 10 బుల్లెట్ కేసింగ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఇది ఆకస్మిక ఘర్షణ కాదని, పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.  ఈ దాడిలో బుల్లెట్లు తగలడంతో మూడో వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ హత్యలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.