
పవిత్రమైన తిరుమలలో ఇటీవల కాలంలో కొందరు డ్యాన్సుల వీడియోలు చేయడంపై తీవ్ర కలకలం రేగింది. శ్రీవారి భక్తులు అలాంటి పనులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దైవదర్శనానికి వచ్చి ఈ రీల్సేంటి అంటూ సోషల్ మీడియాలో కడిగి పారేశారు. తాజాగా తిరుమల ఆలయం వెలుపల ఓ మహిళ తన శారీ బిజినెస్ ప్రమోషన్ రీల్ చేయడం, దానిని డైరెక్ట్ గా తన బొటిక్ పేజ్ లో పోస్ట్ చేయడం మళ్లీ దుమారానికి దారితీసింది. భర్తతో కలిసి దైవదర్శనానికి వచ్చి.. ఇలా బిజినెస్ ప్రమోషన్లు చేయడమేంటి? అంటూ భక్తులు ఫైరవుతున్నారు.
ఇన్ స్టాగ్రామ్ పేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్ బట్టి చూస్తే.. ఆమె పేరు ఆనంది. భర్త పేరు ప్రకాష్. లక్ష్మీ బొటిక్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో పేజ్ ఓపెన్ చేసి చీరలు, హాఫ్ శారీస్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పటికే వారికి రెండున్నర మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తిరుమలలో కట్టుకున్న చీర ప్రమోషన్లు చూసిన భక్తులు అసహనం వ్యక్తం చేశారు. పైగా వీడియో కింద దాని రేటు కూడా పెట్టి బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఒక ఇన్ఫ్లూయెన్సర్ మంచి విషయాలను స్ప్రెడ్ చేయాలి కానీ.. ఇలాంటి రీల్స్ చేసి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. తిరుమలకు వెళ్లినవారెవరైనా అక్కడి వాతావరణం, రాజగోపురం చూస్తూ మంత్రముగ్ధులవుతారు. ఆ జ్ఞాపకాలను తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకుని దాచుకుంటారు. కానీ.. ఇలా బిజినెస్ ప్రమోషన్లు చేసిన ఘటనలు లేవనే చెప్పాలి. ఇలాంటి రీల్స్ చేసేవారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.





