News

నల్లమల ఘాట్ రహదారుల్లో పాదయాత్ర చేస్తున్న శివభక్తులు

140views

మహా శివరాత్రి..ఆ పేరు తలుచుకుంటేనే ఒళ్లు పులకించిపోతుంది. మనసంతా భక్తిభావంతో నిండిపోతుంది. అలాంటిది ఇక శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలంటే.. భక్తుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలమా..ఈ ఏడాదికి సంబంధించి బ్రహ్మోత్సవాలు ఈనెల 8 నుంచి 18 వరకు జరగనున్నాయి. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో భక్తుల పాదయాత్రతో సందడి మొదలైంది. భక్తులు కాలినడకన శ్రీగిరి బాట పట్టారు.

3 నుంచి 4 లక్షల మంది..
నల్లమల సిగన వెలసిన భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శిచుకునేందుకు ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే కాదు కర్ణాటక, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన భక్తులు పెద్దదోర్నాల మీదుగా పాదయాత్రగా వెళ్తున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు శివ మాలధారులు వారిలో ఉన్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసే నాటికి ఇలా వెళ్లే వారి సంఖ్య దాదాపు 3 నుంచి 4 లక్షలు దాకా ఉంటుంది.

అదనంగా 60 కి.మీ. నడవాల్సి వస్తోంది
ప్రతి ఏడాది భక్తులు నంద్యాల జిల్లా వెంకటాపురం నుంచి అభయారణ్యంలో కాలినడకన శ్రీశైలానికి చేరుకుంటారు. ఈ ఏడాది ఆ ప్రాంతంలో పులుల గణన జరుగుతుండటంతో అటవీశాఖ ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే ఆ దారిలో పాదయాత్రకు అనుమతిచ్చింది. అప్పటి వరకు శ్రీశైలానికి వెళ్లే భక్తులు ఘాట్ రహదారుల్లో పెద్దదోర్నాల మీదుగా శ్రీశైలానికి చేరుకోవాలి. అక్కడి నుంచి అయితే 40 కి.మీల మేర నడిస్తే శ్రీశైలానికి చేరుకునేవారు ఇప్పుడు 100 కి.మీలు పాదయాత్ర చేయాల్సి రావడంతో ఇబ్బందులు పడక తప్పదు.

జాగ్రత్తలు తీసుకుంటే మేలు

  • ఘాట్ రహదారిలో పాదయాత్రగా చేసే భక్తులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడవాలి.
  • రాత్రి వేళ దుస్తులకు, చేతి కర్రలకు రేడియం స్టిక్కర్లు ఉంటే వాహనాల వెలుగులో మెరుస్తాయి. ఫలితంగా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.
  • ఒక్కొక్కరుగా కాకుండా గుంపులుగా ప్రయాణం సాగిస్తే క్రూర మృగాల బారిన పడకుండా ముందుకు సాగవచ్చు.
  • ఇరుకు రహదారి కావడంతో మూలమలుపుల వద్ద భక్తులు జాగ్రత్త పడాలి.
  • రాత్రి వేళల్లో గూడేల్లో ఆశ్రయం పొందాలి.