
గోసంతతిని కాపాడుకోవడం మత విశ్వాసం కానేకాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్లేనని, ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తును కాపాడినట్లేనని పేర్కొన్నారు. ఇస్లాంలోనూ కొందరు మత పెద్దలు గోవును పక్కన పెట్టుకుని నమాజ్ చేసిన దృశ్యాలను తాను చూశానని అన్నారు. హైదరాబాద్లోని నారాయణగూడ కేఎంఐటీ ఇంజనీరింగ్ కాలేజీ, తెలంగాణ గో సేవా విభాగం ఆధ్వర్యంలో ‘గోవు పర్యావరణ పరిరక్షణలో శాస్త్రీయ విజ్ఞానం’పై రాష్ట్రస్థాయి పరీక్షా పోటీలు నిర్వహించారు. విజేతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
‘నగరాలు, పట్టణాల్లోకే కాదు.. గ్రామాల్లోకి కూడా పాల ప్యాకెట్లు, పాల పౌడర్ డబ్బాలు, ప్యాకేజ్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ (పాల ఉత్పత్తులు) వచ్చేసినయ్. నూటికి 90 శాతం మంది వాటిపైనే ఆధారపడి జీవించే పరిస్థితిలోకి వచ్చేసినం. లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తినే తిండి, తాగే నీళ్ల వరకు అన్నీ కలుషితం అయిపోయినయ్. కడుపులో పిండాన్ని కూడా మనం తినే తిండితో కలుషితం చేస్తున్నం. బయట ప్రపంచంలోకి అడుగు పెట్టింది మొదలు జీవితాంతం రకరకాల టీకాలు, ఇంజక్షన్లు, మందులు, టెస్ట్లతోనే గడిపే పరిస్థితి వచ్చింది.
దీనికి కారణం మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, మన జీవన విధానాన్ని మర్చిపోయి విదేశీ సంస్కృతికి, జీవన విధానానికి అలవాటు పడటమే ప్రధాన కారణం. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మన భవిష్యత్ తరాల మనుగడే ప్రమాదంలోకి వెళ్లే అవకాశముంది. ఈ పద్దతి మారాలంటే భారతీయ మూలాలపై నేటి తరానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం పాటుపడుతున్న గోసేవా విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరినీ అభినందిస్తున్నా.
తల్లి తరువాత అంతటి గొప్ప స్థానం ఆవుకు ఇస్తాం. అందుకే గోమాత అని పిలుచుకుంటాం. మన పండించే పంటలకు, తిండికి, శక్తికి గోమాత ప్రధాన కేంద్ర బిందువు. పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడే జీవి ఏదైనా ఉందంటే అది గోమాత మాత్రమే. ఎందుకంటే గోమయం, గోమూత్రం, పాలు, పెరుగు, నెయ్యి సహా గోవు నుంచి వచ్చే ప్రతీ ఉత్పత్తి పర్యావరణానికి అత్యంత అనుకూలమైనదే. మనం, మన పిల్లలు బాగుండాలంటే గోవులను కాపాడుకోవాలి. మన రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 42 లక్షల పశు సంపద మాత్రమే ఉంది. అందులో సగం పాలు ఇవ్వనివే ఉన్నాయి’ అని అన్నారు.





