
భారతదేశ స్వదేశీ సామర్థ్యాలు, సాయుధ దళాల మధ్య ప్రభావవంతమైన సమన్వయానికి ఆపరేషన్ సిందూర్ ఒక ఉదాహరణ అని వాయుసేన అధిపతి ఏపీ సింగ్ పేర్కొన్నారు. 93వ వైమానిక దళ దినోత్సవంలో భాగంగా ఘజియాబాద్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా శత్రు భూభాగంపై కచ్చితమైన దాడులు చేసేందుకు స్వదేశంలో అభివృద్ధి చేసిన ఆయుధాలు అద్భుతమైన పనితీరు కనబరిచాయన్నారు. స్వదేశీ ఆయుధాలు మన విశ్వాసాన్ని వమ్ముచేయలేదన్నారు. కచ్చితమైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన శిక్షణ, నిర్ణీత అమలుతో ఏం సాధించవచ్చనేది ఈ ఆపరేషన్లో చూపించామన్నారు. వైమానిక దళాన్ని సమర్థమంతంగా ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రపంచానికి చాటిచెప్పామన్నారు. 1948, 1971, 1999తో పాటు బాల్కోట్లో ఉగ్రవాదుల విధ్వంసం, ఆపరేషన్ సిందూర్లలో భారత వైమానిక యోధులు తమ పరాక్రమంతో చరిత్ర సృష్టించారన్నారు. ఈసందర్భంగా వారిని ఉద్దేశిస్తూ.. మనం దేశ గౌరవానికి సంరక్షకులమన్నారు. వైమానిక దళ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అవసరమైతే మరింత శిక్షణ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ నేపథ్యంలో ఆపరేషన్ సింధూలో భాగంగా అక్కడి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడంలో వైమానిక దళం పాత్రను ఆయన అభినందించారు.





