News

సనాతనానికి మూల స్తంభాలు వేదాలు

152views

సనాతన సంస్కృతికి మూల స్తంభాలు వేదాలేనని తిరుపతికి చెందిన వేద పండితుడు దూవ్వూరి ఫణి యజ్ఞేశ్వర సోమయాజులు ఘనపాఠి అన్నారు. శ్రీ కోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ ఆధ్వర్యంలో అమలాపురంలోని స్థానిక సత్య సాయి కల్యాణ మండపంలో జరిగిన 63వ వార్షికోత్సవ వేద సభలో ఆయన ఉపన్యసించారు. ఈ సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 250 మంది వేద పండితులు వచ్చి వేదాలను ఘోషించారు. వంక రామకృష్ణ విద్యాశంకర్‌ అధ్యక్షతన వేదసభ సాగింది. వేద పండితులు కడియాల వేంకట సత్య సీతారామ ఘనపాఠి, శృంగేరి అస్థాన విద్వాంసులు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, విష్ణుభట్ల సుబ్రహ్మణ్యేశ్వర ఘనపాఠి, గుళ్లపల్లి విశ్వనాథ ఘనపాఠి, విష్ణుభట్ల శ్రీకృష్ణ ఘనపాఠి, హైదరాబాద్‌కు చెందిన హరి సీతారామమూర్తి సలక్షణ ఘనపాఠి, వడ్లమాని సుబ్రహ్మణ్య ఘనపాఠి వేదికపై ఆశీనులై వేదాల విశిష్టతను వివరించారు. వేద ధ్వనితో సమాజ వికాసమే కాకుండా వాతావరణం కూడా పవిత్రం అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచానికి రక్ష ధర్మమే, ఆ ధర్మానికి మూలం వేదమేనన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో నిత్యం పారే గోదావరి పాయలు వేదల్లా ఘోషిస్తున్నాయంటే అది ఆ వేదాల్లోని శక్తి వల్లేనని పేర్కొన్నారు. అనంతరం వందలాది మంది వేద పండితులు ఒకేసారి పలికిన వేద స్వస్తితో అమలాపురం పట్టణం పునీతమైంది. కోనసీమ భాష వేద ఘోష అన్నట్లుగా స్వస్తి సాగింది. అనంతరం వేద పండితులను వేద శాస్త్ర సన్మాన సభ కార్యదర్శి గుళ్లపల్లి వెంకట్రామ్‌, సభ సభ్యులు శిష్టా భాస్కర్‌, కుమారశాస్త్రి, యేడిది సుబ్రహ్మణ్యం తదితరులు ఘనంగా సత్కరించారు. వేదాభిమానులు మండలీక ఆదినారాయణ, పుత్సా కృష్ణ కామేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

వేదాలను పోషించడం అభినందనీయం
ఏడాదికోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వేద పండితులను ఆహ్వానించి సత్కరించడం అంటే సాక్షాత్తు వేదాలను గౌరవించడమే. కోనసీమ వేద శాస్త్ర సభ వేదాలను పోషిండచం అభినందనీయం. ధర్మాన్ని మనం ఆచరిస్తే వేదాలు మన ధర్మాన్ని కాపాడుతాయి. వేదాలు ఎక్కడ పోషిస్తే అక్కడ వేదాలు శోభిల్లుతాయి. వేద భూమి కోనసీమ. ఈ సీమలో ప్రవహించే నదీ పాయలు కూడా వేదాలు ఘోషిస్తాయి.– హరి సీతారామమూర్తి, సలక్షణ ఘనపాఠి, వేద పండితుడు, హైదరాబాద్‌

మానవ మనుగడను నిర్దేశించేవి వేదాలే
మానవ మనుగడను నిర్దేశించేవి వేదాలే. నాలుగు వేదాలతోనే ప్రపంచం నడుస్తోంది.వేదాధ్యయనం, వేదన పఠనం చేసిన పండితులు లోక కల్యాణంలో భాగస్వాములే అవుతారు. కోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ వేద పండితులను వామన జయంతి నాడు సత్కరించడం, వేద స్వస్తి చెప్పించం లోక కల్యాణం కోసమే. ఈ సంస్థ వేదాలను పోషిండచం మాలాంటి వేద పండితులకు ఎంతో ఆనందం.– ఉపాధ్యాయుల కాశీ విశ్వ సోమయాజులు, టీటీడీ తెలంగాణ రాష్ట్ర సూపర్‌వైజర్‌