News

సనాతన ధర్మ, సంస్కృతిని తెలియజెప్పేందుకు వినాయక చవితి ఉత్సవాలు

155views

ఆపరేషన్‌ సింధూర్‌కు అంకితం
గణేష్‌ ఉత్సవాలకు రాష్ట్రంలోనే పేరుగాంచిన కర్నూలు నగరంలో గురువారం వినాయక నిమజ్జనం కనులపండువగా సాగింది. 45వ ఏడాది దాదాపు 1,700 విగ్రహాలతో నిర్వహించిన శోభాయాత్ర ఆఽధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. కుల మతాలకు అతీతంగా నిర్వహించిన వేడుకను ఆపరేషన్‌ సింధూర్‌కు అంకితమివ్వడం విశేషం.

తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుని నిమజ్జనోత్సవం గురువారం కర్నూలు నగరంలో కనుల పండువగా సాగింది. ఓల్డ్‌సిటీలోని రాంబొట్ల ఆలయం వద్ద నిమజ్జన శోభాయాత్ర పూజను జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, నంద్యాల పార్లమెంట్‌ సభ్యురాలు బైరెడ్డి శబరి, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ విశ్వనాథ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ప్రారంభించారు. వేలాది భక్తుల హర్షధ్వానాల మధ్య శోభాయాత్ర ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నగరం నడి మధ్యలో కేసీ కెనాల్‌లో విఘ్నేశ్వరునికి ఘనంగా వీడ్కోలు పలికారు. కేసీ కెనాల్‌కు ఇరువైపుల పది ఘాట్‌లలో ఏడు క్రేన్‌లు, స్టాంటన్‌ పురం మమతా నగర్‌ వద్ద ఘాట్‌లో ఒక క్రేన్‌తో, సంతోషనగర్‌ హైవే తుంగ భద్రా నది బ్రిడ్జి వద్ద నిమజ్జనం వైభవంగా నిర్వహించారు. వినాయక ఘాట్‌లో జ్యోతి ప్రజ్వలన, ధ్వజారోహణ, భరతమాత పూజ, వినాయక పూజలు చేసి కలెక్టరేట్‌ పరిపాలనా విగ్రహం, నగర పాలకం సంస్థ ఆధ్వర్యంలోని వినాయక విగ్రహాలతో నిమజ్జనం మొదలైంది.

ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత సహ కార్యవాహక ఎం.శ్రీనివాసరెడ్డి ముఖ్య వక్తగా హాజరై సందేశమిచ్చారు. ప్రజలను సమైక్యం చేసేందుకే 1893లో బాల గంగాధర్‌ తిలక్‌ గణేష్‌ సామూహిక ఉత్సవాలను ప్రారంభించారన్నారు. దేవాలయాలు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా నిలుస్తున్నాయన్నారు. కొందరు సనాతన ధర్మాన్ని అంతం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారని.. అయితే అది అంత సులువు కాదన్నారు. నేటి తరానికి సనాతన ధర్మ, సంస్కృతి సంప్రదాయాలు తెలియజెప్పేందుకు వినాయక చవితి ఉత్సవాలు దోహదం చేస్తున్నాయన్నారు. సుమారు 1,700 విగ్రహాలు 2వేల మంది పోలీస్‌ల బందోబస్తు, 2వేల మంది స్వచ్ఛంద సేవకుల నడుమ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగింది.

సంప్రదాయబద్ధంగా శోభాయాత్ర
ఓల్డ్‌సిటీ కుమ్మరి వీధిలోని రాంబొట్ల ఆలయం వద్ద మొదటి విగ్రహానికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అక్కడ వినాయక లడ్డూ ప్రసాదానికి వేలం నిర్వహించగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఐదో ఏడాది రూ.6,01,000లకు దక్కించుకున్నారు. శోభా యాత్ర సంప్రదాయ బద్ధంగా మేళతాళాలు, డ్రమ్ములు, కోలాటాలు, కర్రల విన్యాసాలు, చెక్క భజనల నడుమ సాగింది. స్వామి వివేకానంద సంస్కృత పాఠశాల, కేశవ మెమోరియల్‌ పాఠశాల విద్యార్థుల ఘోష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సాంస్కృతిక కార్యక్రమాలు
వినాయక ఘాట్‌ ప్రధాన వేదికపై పలు విద్యా సంస్థల విద్యార్థులు, సంగీత, నృత్య కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. వినాయక్‌ ఘాట్‌లో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా వేడుకలను పర్యవేక్షించారు.