ArticlesNews

ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! 2 వ భాగం

234views

ద్రవిడవాద సిలువపై సనాతన నాగరికత! – 1 వ భాగం ఇక్కడ చదవండి

తమిళ నాగరికత ఆనవాళ్లు
కీళడి గ్రామంలో 2013-14, 2014-15, 2015-16 ఇలా మూడు సీజన్లలో పురావస్తు ప్రదేశాల కోసమని తవ్వకాలు జరిగాయి. వీటికి భారత పురావస్తు సర్వేక్షణ `ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా` ఏఎస్‌ఐ సూపరింటెండిరగ్‌ ఆర్కియాలజిస్ట్‌ (ఎస్‌ఏ) కె. అమర్‌నాథ్‌ రామకృష్ణ నేతృత్వం వహించారు. వైగై నది వెంబడి పురావస్తు ప్రదేశాలు, అవశేషాలను కనిపెట్టడం ఈ తవ్వకాల ఉద్దేశం. అందులో భాగంగా వైగై నది వెంబడి దాదాపు 293 పురావస్తు ప్రదేశాలు, వివిధ రకాల పురాతన అవశేషాలు ఉన్న లోయను గుర్తించారు. ఇది నేల మట్టానికి రెండున్నర మీటర్ల దిగువన ఉందని కనుగొన్నారు. ప్రస్తుతం ఏఎస్‌ఐ తవ్వకాలు జరుపుతున్న ప్రాంతం 3.5 కి.మీ.ల వ్యాసార్థంలో 80 ఎకరాల మేర విస్తరించి ఉంది. కొందగై, మణలూర్‌ అనే పురాతన పట్టణాలు కూడా ఈ ప్రాంతంలో భాగం. ఈ తవ్వకాలు ఇక్కడి సాంస్కృతిక పరిణామాలపై కీలకమైన వివరాలను అందిస్తు న్నాయి. అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి రాసాగాయి.

ప్రారంభంలో, ఈ ప్రదేశం క్రీ.పూ. 5వ శతాబ్దం, క్రీ.పూ. 3వ శతాబ్దం మధ్య కాలం నాటిదని అంచనా వేశారు. దీన్ని నిర్ధారించడం కోసమని 2017లో ఇక్కడి నుంచి రెండు నమూనాలను కార్బన్‌ డేటింగ్‌ (రేడియో కార్బన్‌ సహాయంతో వయసును నిర్ధారించే ప్రక్రియ) కోసమని అమెరికా, ఫ్లోరిడా రాష్ట్రంలో మియామీలోని బీటా అనలిటిక్‌ అనే రేడియో కార్బన్‌ డేటింగ్‌ ప్రయోగశాలకు పంపించారు.

ఎముకలతో తయారుచేసిన నేత పని సామగ్రి
జూలై, 2017లో కార్బన్‌ డేటింగ్‌ ఫలితాలు వచ్చాయి. రెండు నమూనాలు సుమారు 2,200 సంవత్సరాల క్రితం అంటే క్రీ.పూ. 3వ శతాబ్దం నాటివని అవి నిర్ధారించాయి. నాల్గవ దశ తవ్వకం నుంచి పొందిన నమూనాల రేడియో కార్బన్‌ డేటింగ్‌లో ఒక కళాఖండం క్రీ.పూ. 6వ శతాబ్దం నాటిదని తేలింది. మరొక నమూనా కాలాన్ని నిర్దారించడంలో మరింత కచ్చితత్వాన్ని ప్రదర్శించే యాక్సలెరేటర్‌ మాస్‌ స్పెక్ట్రోమెట్రీ`ఏఎంఎస్‌ డేటింగ్‌ కోసమని బీటా అనలిటిక్‌కు పంపించారు. అది భూమిలో 353 సెం.మీ.ల లోతు నుంచి సేకరిం చింది. ఏఎంఎస్‌ డేటింగ్‌ ఫలితాల్లో ఆ నమూనా 580 బీసీయీ(సాధారణ శకానికి పూర్వం) నాటిదని తేలింది.

కీళడి తవ్వకాల్లో ఇటుక గోడలతో కట్టిన భవనాలు, మట్టి పాత్రలు, టెర్రకోట మట్టికుండలు, పాత్రలు, పూసలు, విలువైన గాజులు, రాళ్లు, చదరంగంలో ఉపయోగించే పావులు, పొత్రం, దంతపు దువ్వెన, ఎముకలతో తయారు చేసిన నేత పనిలో వాడే సామగ్రి, వలయాకార బావులు బైటపడ్డాయి. ఇటుకల్లో కొన్ని 38 సెం.మీ.ల పొడుగు, 26 సెం.మీ.ల వెడల్పు, 6 సెం.మీ.ల మందంతో ఉన్నాయి. మరి కొన్ని 38 సెం.మీ.ల పొడుగు, 23 సెం.మీ.ల వెడల్పు 6 సెం.మీ.ల మందం కలిగి ఉన్నాయి.

ఈ ఆవిష్కరణల గురించి పురావస్తు శాస్త్రవేత్త వేలప్పన్‌ మాట్లాడుతూ తమిళులు నది ఒడ్డున చెరువులలో నీటి కోసం బావులను ఉపయోగించారని సూచించే పురాతన సంప్రదాయాన్ని ఇది రుజువు చేస్తుందని అన్నారు. పురాతన కాలంలో అరుదుగా భావించే ఇటుక భవనాలు ఇక్కడ పెద్ద సంఖ్యలో బైటపడ్డాయి.

కీళడి ఇనుప యుగం నుంచి ప్రారంభ చారిత్రక కాలానికి పరివర్తనను వివరించే ఓ ప్రదేశం. ఇనుప యుగం, ప్రారంభ యుగం మధ్య ఉన్న సంబంధా లను, చారిత్రక కాలం, తదుపరి సాంస్కృతిక పరిణామాలు అర్థం చేసుకోవడానికి కీళడిలో తవ్వకాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

కీళడి తవ్వకాల్లో వెలుగుచూసిన ఆరు వస్తువు లను అధికారులు ఏఎంఎస్‌ డేటింగ్‌ కోసమని బీటా అనలిటిక్‌కు పంపించారు. ఈ వస్తువులు క్రీ.పూ. ఆరు, మూడు శతాబ్దాల మధ్య కాలానివని పరీక్షలో తేలింది. భూమి ఉపరితలం నుంచి 353 సెం.మీ.ల లోతులో బయటపడిన వస్తువులు క్రీ.పూ.580వ సంవత్సరానివని, 200 సెం.మీ.ల లోతులో దొరికినవి క్రీ.పూ. 205వ సంవత్సరానివని పరిశోధనలో వెల్లడైంది. ఈ రెండు లోతుల ఎగువన, దిగువన ఇంకా వస్తువులు ఉండటాన్ని పరిగణనలోకి తీసుకొని, కీళడి తవ్వకాల ప్రాంతం క్రీ.పూ. మూడో శతాబ్దానికి చెందినదిగా ఏఎస్‌ఐ తేల్చింది.

బ్రహ్మి లిపలో కుండపై రాసిన ఆదన్, కువిరన్
ప్రస్తుత తమిళనాడు చరిత్ర క్రీ.పూ. మూడో శతాబ్దంతో మొదలవుతుంది. అయితే గంగా నదీ తీర పట్టణ నాగరికత తరహాలో అప్పట్లో తమిళనాడులో పట్టణ నాగరికత లేదని అధ్యయన కారులు భావిస్తూ వచ్చారు. కానీ, గంగా పట్టణ నాగరికత కాలంలోనే తమిళనాడులో పట్టణ నాగరికత ప్రారంభమైందని కీళడి తవ్వకాల్లో లభించిన తాజా ఆధారాలు చెబుతున్నాయి.

కోడుమణల్‌, అళగాంకుళం గ్రామాల్లో గతంలో లభించిన శాసనాలను బట్టి బ్రాహ్మి లిపి క్రీ.పూ. మూడో శతాబ్దం నాటిదని భావించారు. కీళడిలో బయల్పడిన వస్తువులు ఈ లిపి క్రీ.పూ. ఆరో శతాబ్దానిదని సూచిస్తున్నాయి. కీళడిలో సుమారు 2,600 ఏళ్ల క్రితం నివసించినవారు అక్షరాస్యులని, వారికి చదవడం, రాయడం వచ్చని ఈ ఆధారాలను బట్టి తెలుస్తోందని తమిళనాడు పురావస్తు శాఖ తెలిపింది. కీళడి తవ్వకాల్లో పరిశోధకులకు సుమారు 70 ఎముకలు లభించాయి. వీటిలో 53 శాతం ఎముకలు ఎద్దు, బర్రె, మేకలు, ఆవులు లాంటి జంతువులవి. నాటి ప్రజలు పశుపోషణ చేసినట్లు వీటిని బట్టి స్పష్టమవుతోంది.

ఇక్కడ దొరికిన గవ్వలు, కళాఖండాల్లో, ఇసుక, ఇనుము, మెగ్నీషియం, అల్యూమినియం ఉన్నట్లు గుర్తించారు.

భారత్‌లో గుర్తించిన అత్యంత పురాతన శాసనం సింధు లోయ నాగరికతది. సింధు లోయ నాగరికత ముగిశాక, బ్రాహ్మి లిపిలో శాసనాలు రూపొందించక ముందు శాసనాలు వేయడానికి గ్రాఫిటీ (గోడ రాతలు) అనే పద్ధతి వాడుకలో ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. సింధు నాగరికత శాసనాల తరహాలో ఈ గ్రాఫిటీ పద్ధతులను అర్థం చేసుకోవాల్సి ఉంది. బృహత్పరికర లేదా మహాపాత్రా (మెగాలిథిక్‌) నాగరికతలో, కాంస్య యుగ నాగరికతలో ఈ పద్ధతుల్లో రాసిన శాసనాలు ఉన్నాయి. కీళడిలో 1001 కళాఖండాల్లో ఈ శాసనాలు కనిపించాయి. 56 కళాకృతులపై బ్రాహ్మి లిపిలో శాసనాలు ఉన్నాయి. ఆదన్‌, కువిరన్‌ ఆద(న్‌) అనే పదాలు కూడా ఉన్నాయి. ఇవి కుండలపై ఉన్నాయి. ఈ రాతలను సాధారణ పద్ధతికి భిన్నంగా, కుండ పూర్తిగా తయారై ఆరిపోయాక రాశారు. ఒకరి కంటే ఎక్కువ మంది వీటిని రాసి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు.

కీళడిలో నాలుగు మీటర్ల ఎత్తున్న కుండను పోలిన కళాఖండాలను పెద్ద మొత్తంలో రెండు చోట్ల కనుగొన్నారు. నాడు కుండల తయారీ పరిశ్రమ భారీగా ఉండేదని వీటి ఆధారంగా ఏఎస్‌ఐ అంచనాకు వచ్చింది.

నాటి మహిళలు ధరించిన ఏడు వేర్వేరు ఆభరణాల్లోని కొన్ని భాగాలను పరిశోధకులు కనుగొన్నారు. టెర్రకోటతో తయారుచేసిన ఆటవస్తువులను కూడా గుర్తించారు.

కార్నీలియం, అకోట్‌తో తయారుచేసిన పూసలు కీళడిలో దొరికాయి. ఇవి సాధారణంగా గుజరాత్‌, మహారాష్ట్రలో లభిస్తుంటాయి. 13 మనిషి బొమ్మలు, మూడు జంతువుల బొమ్మలు, టెర్రకోట మట్టితో తయారుచేసిన 650 ఆటవస్తువులు, 35 చెవిదిద్దులను ఏఎస్‌ఐ గుర్తించింది. అయితే పూజించడాన్ని సూచించే వస్తువేదీ కనిపించలేదు.

తమిళ సంగం యుగం మూడో శతాబ్దం, రెండో శతాబ్దం మధ్యదని ఇప్పటివరకు పరిగణిస్తూ వచ్చారు. కీళడిలో ఇటీవల బ్రాహ్మి లిపిలో లభించిన శాసనాలను బట్టి సంగం కాలం అంతకంటే ఇంకా మూడు వందల ఏళ్లు పురాతనమైనదని పరిశోధకులు భావిస్తున్నారు.

భారత్‌లో తొలి పట్టణ నాగరికత సింధు లోయ నాగరికత అయితే రెండవదిగా గంగా పట్టణ నాగరికత ఉంది. గంగా పట్టణ నాగరికత కాలంలో భారత్‌లో మరే పట్టణ నాగరికతా లేదని ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఈ భావన తప్పని తొలిసారిగా కీళడి ఆధారాలు రుజువు చేశాయి. గంగా పట్టణ నాగరికత కాలంలోనే భారత్‌లో మరో పట్టణ నాగరికత ఉందని ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. గంగా పట్టణ నాగరికత తరహాలో దక్షిణ భారతదేశంలోనూ పట్టణ నాగరికత (తమిళ సంగం) రెండో పట్టణ నాగరికతగా విలసిల్లిందని వీటిని బట్టి చెప్పొచ్చు.ఉత్తర భారతదేశంలోని ప్రజలతో, రోమన్లతో కీళడి ప్రాంత ప్రజలు వ్యాపారం సాగించినట్లు ఇక్కడ లభించిన చాలా కళాఖండాలు సూచిస్తున్నాయి.