
ఉత్తరప్రదేశ్కు చెందిన స్వయం ప్రకటిత దేవుడు జలాలుద్దీన్ అలియాస్ ఛాంగూర్ బాబా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యూహాత్మకంగా లవ్ జీహాద్ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. గత మూడేళ్లుగా హిందూ మహిళలను మతమార్పిడి కోసం వలలో వేసుకోవడానికి 1,000 మందికి పైగా ముస్లిం పురుషులకు నిధులు సమకూర్చాడని సమాచారం. పేద, వితంతువులు, బలహీన మహిళలను క్రమపద్ధతిలో లక్ష్యంగా చేసుకుని మతమార్పిడి రాకెట్ను నిర్వహించడానికి ముస్లిం దేశాల నుంచి రూ. 500 కోట్లు అందుకున్నట్టు గుర్తించారు. ఈ కేసు వ్యవహారంలో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) చర్యలు మొదలుపెట్టింది. అక్రమంగా మతమార్పిడులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛాంగూర్ బాబాపై యూపీ ఏటీఎస్తో పాటు ఎన్ఐఏ, ఈడీలు ఈ కేసులో విచారణ జరుపుతున్నాయి.
ఇండో-నేపాల్ సరిహద్దుల ద్వారా ఉత్తరప్రదేశ్లోని ఏడు జిల్లాల్లోని ముస్లిం పురుషులకు చెల్లింపులు జరిగాయి. లవ్ జీహాద్ ద్వారా హిందూ బాలికలను ఆకర్షించిన ముస్లిం యువకులకు కూడా ఛాంగూర్ బాబా ఈ చెల్లింపులు చేశాడని అధికారులు ధృవీకరించారు. ఛాంగూర్ బాబాతో పాటు, అతని సహచరుడు నీతు అలియాస్ నస్రీన్ను కూడా అరెస్టు చేసి ఏడు రోజుల ఏటీఎస్ కస్టడీకి పంపారు. విదేశాల నుంచి వచ్చిన నిధులను నీతు నస్రీన్ నిర్వహించేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశీ నిధులు వచ్చిన మార్గాన్ని గుర్తించడంతో పాటు మరిన్ని సంబంధాలను వెలికితీయడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.





