
అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం నాలుగు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. మౌలానా ముఫ్తీ హస్బుల్లా, మొహద్ ఉమర్, మౌలానా మహఫుజూర్ రెహమాన్, మిస్బాహుద్దీన్ కొత్తగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. నవంబర్ 9 నాటి తీర్పుపై పునఃసమీక్షించాలని తమ పిటిషన్లలో పేర్కొన్నారు.
ఏళ్లుగా నలుగుతున్న అయోధ్య భూవివాదంపై నవంబర్ 9న అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామ మందిర నిర్మాణానికి వీలుగా ‘రామ్లల్లా’కు అప్పగించాలని పేర్కొంది. సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల భూమిని మసీదు నిర్మాణం కోసం కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ తీర్పుపై డిసెంబర్ 2న తొలి రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమాయిత్ ఉలేమా ఇ హింద్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. బాబ్రీ మసీదు పునర్నిర్మించేలా ఆదేశించినప్పుడే న్యాయం జరిగినట్లు అవుతుందని తన పిటిషన్లో ఆ సంస్థ పేర్కొంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





