News

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మతోన్మాది.. ఘర్షణకు కారణం ఆయనే..

461views

హల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదులే టార్గెట్‌గా ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ తర్వాత పాక్ జరిపిన వైమానిక దాడుల్ని తిప్పికొట్టింది. భారత దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 11 కీలకమైన ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాల తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ డచ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంట్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునిర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆసిమ్ మునీర్‌కి ‘ఫీల్డ్ మార్షల్’గా పాక్ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తీవ్రమైన ‘‘మతపరమైన దృక్పథం’’ ద్వారానే పహల్గామ్ ఉగ్రదాడికి ఉగ్రవాదులు పాల్పడ్డారని, 26 మందిని మతం ఆధారంగా టార్గెట్ చేసి చంపారని అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా మతపరమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టారని విమర్శించారు. పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ‘హిందువులు, ముస్లింలు కలిసి ఉండలేరు’ అని పాకిస్తాన్ సంస్కృతిని ప్రస్తావించిన మునీర్‌ను జైశంకర్ ఒక మతోన్మాదిగా పిలిచినట్లు తెలుస్తోంది.

‘‘ పహల్గామ్ ఉగ్రదాడి జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం అయిన పర్యాటక రంగానికి హాని కలిగించే, మతపరమైన విభేదాలను సృష్టించే ఉద్దేశ్యంతో జరిగింది. ఉద్దేశపూర్వకంగా మతం అనే అంశాన్ని ప్రవేశపెట్టారు. తీవ్రమైన మతపరమైన దృక్ఫథంతో నడిచే పాకిస్తాన్ నాయకత్వం, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ దీని వెనక ఉన్నారు’’ అని జైశంకర్ చెప్పారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యక్తం చేసిన అంశాలకు, పహల్గామ్ ఉగ్రవాద ప్రవర్తనకు మధ్య స్పష్టంగా సంబంధం ఉందని డచ్ బ్రాడ్ కాస్టర్‌తో ఆయన చెప్పారు.