
ఔరంగజేబు సమాధి అంశంపై రాష్ట్ర శాసన మండలిలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. నాగ్పూర్ హింసపై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే కౌన్సిల్లో ప్రసంగిస్తూ… ఎవరి సమాధిని తొలగించాలని ఇప్పుడు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయో అటువంటి వ్యక్తిని గురించి పొగడటమేమిటి? ‘ఔరంగజేబు ఎవరు? మన రాష్ట్రంలో ఆయనను కీర్తించడాన్ని మనం ఎందుకు అనుమతించాలి? రాష్ట్ర చరిత్రలో అతను ఒక మాయని మచ్చ‘ అని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాలనను ఔరంగజేబు పాలనతో పోల్చడాన్ని శిందే తీవ్రంగా తప్పుపట్టారు. ఫడ్నవీస్ పాలన, ఔరంగజేబు పాలనా ఒకటేనా? ‘ఔరంగజేబు తన శత్రువులను హింసించిన విధంగా ఫడ్నవీస్ ఎప్పుడైనా ఎవరినైనా హింసించారా?‘ అంటూ శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ అనిల్ పరబ్ వైపు తిరిగి ప్రశ్నించారు.
దీనికి పరబ్ కోపంగా తనకు ఈ విషయంపై స్పందించే అవకాశమివ్వాల్సిందిగా చైర్మన్ను కోరారు. కానీ చైర్మన్ రామ్శిందే పరబ్ను అనుమతించలేదు. ఇంత జరుగుతున్నా శిందే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘నేనేంచేసినా బహిరంగంగా చేశా. ఔరంగజేబ్ (కాంగ్రెస్) పట్ల సానుభూతి చూపే వారి నుంచి శివసేనను కాపాడడానికే నేను ఇదంతా చేస్తున్నానని అనిల్ పరబ్ మర్చిపోకూడదు. ఔరంగజేబ్ సమాధికి రక్షణ కల్పించింది కాంగ్రెస్సే‘ అని వ్యాఖ్యానించారు.





