News

ప్రభుత్వ ఉత్తర్వులను భేఖాతరు చేసిన మౌలానా

333views

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో లౌడ్‌ స్పీకర్‌లను బ్యాన్‌ చేస్తూ స్థానిక అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపధ్యంలో ఒక మౌలానా(ముస్లిం మతపెద్ద) మసీదుపైకి ఎక్కి పెద్దగా అరుస్తూ, ముస్లిం సోదరులంతా నమాజ్‌కు రావాలని పిలుపునిచ్చారు. షాహీ జామా మసీదుపై జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

కోర్టు తీర్పు అనంతరం సంభాల్‌లోని అన్ని ప్రార్థనా ‍స్థలాలు, మత ప్రదేశాలలో లౌడ్‌ స్పీకర్ల వినియోగాన్ని అధికారులు నిషేధించారు. అయితే ఇప్పుడు వీటిని ఉల్లంఘించినందున పోలీసులు ఆ మసీదుకు చెందిన ముగ్గురు మతపెద్దలపై కేసు నమోదు చేశారు. సంభాల్‌లోని షాహీ జామా ఇమామ్‌ మసీదు గత కొన్నాళ్లుగా వివాదాల్లో ఉంది. ఈ మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో కల్కి ఆలయం ఉండేందని ఒక న్యాయవాది కోర్టులో దావా వేశారు.

ఈ నేపధ్యంలో స్థానిక కోర్టు ఈ మసీదు సర్వేకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే రెండవ రోజున పెద్దసంఖ్యలో జనం మసీదు దగ్గరకు చేరుకున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులకు జనానికి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. 20 మంది పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు. నాటి నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది.

ఇదే సమయంలో స్థానిక పరిపాలనా యంత్రాంగం అల్లర్లకు పాల్పడినవారిపై చర్యలు పట్టింది. సమాజ్‌వాదీ ఎంపీ బార్క్ కూడా ఈ వివాదాల్లో చిక్కుకున్నారు. ఇదిలావుండగా అక్రమ విద్యుత్ కనెక్షన్‌లను తొలగించేందుకు వెళ్ళిన బృందం ఒక పురాతన ఆలయాన్ని కూడా కనుగొంది. ఆలయం చుట్టూ ఒక బావిని కూడా వారు చూశారు. దీని తరువాత సంభాల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలయ్యింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్ ఇంట్లో కొంత భాగం అక్రమ నిర్మాణం పరిధిలోకి వచ్చింది. దీంతో ఎంపీ ఇంటి మెట్లను సంబంధిత అధికారులు తొలగించారు.