
సంత్ గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 12వ తేదీని పబ్లిక్ హాలిడేగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రకటించారు. గతంలో రవిదాస్ జయంతిని ఢిల్లీలో ‘రిస్ట్రిక్టెడ్ హాలిడే’గా పాటించేవారు. ఆ ప్రకారం ఉద్యోగులు ఐచ్ఛికంగా పనిచేయడం కానీ, సెలవు తీసుకోవడం కానీ జరిగేది.
కాగా, ఫిబ్రవరి 12వ తేదీని పబ్లిక్ హాలిడేగా లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించడంతో ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు ఆరోజు మూతపడతాయి. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన రోజుగా గురు రవిదాస్ అనుచరులు ఆయన జయంతిని ఏటా జరుపుతుంటారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 1377 CE ప్రాంతంలో జన్మించిన రవిదాస్ భక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు. సాధువుగా, కవిగా పలు సామాజిక సంస్కరణలు చేపట్టారు. కుల, లింగ ఆధారిత సామాజిక అడ్డంకులు తొలగించేందుకు పాటుపడ్డారు. రవిదాస్ భక్తి శ్లోకాలు సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్లో కూడా కనిపిస్తాయి. మీరాబాయికి ఆధ్యాత్మిక గురువుగా కూడా ఆయనను చెబుతారు. గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఆయన అనుచరులు హారతులు, నగర సంకీర్తనలు జరుపుతారు. నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.





