
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విశాల్ తివారీ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం నమోదు చేసారు. భక్తుల భద్రత కోసం మార్గదర్శకాలు, నియమాలను సరిగ్గా అమలు చేయాలంటూ దాఖలు చేసిన ఆ పిల్ను సుప్రీంకోర్టు ఇవాళ డిస్మిస్ చేసింది.
కుంభమేళాలో జనవరి 29న జరిగిన తొక్కిసలాటలో 30మంది చనిపోయారు, మరో 60మంది గాయపడ్డారు. సుప్రీంకోర్టు ఆ సంఘటన తీవ్రతను గుర్తిస్తూనే, దానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని విశాల్ తివారీకి సూచించింది. సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్ను సుప్రీంకోర్టులో విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు.
తొక్కిసలాట ఘటనలు జరిగినప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం మీద సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలని విశాల్ తివారీ కోరారు. ఆ మేరకు విధివిధానాలను రూపొందించాలని కోరారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సుప్రీంలో పిల్ అక్కర్లేదని వాదించారు. ‘‘ఘటనపై జ్యుడీషియల్ ఇంక్వైరీ జరుగుతోంది. ఇటువంటి పిటిషన్ యూపీ హైకోర్టు ముందు పెండింగ్లో ఉంది. కాబట్టి సుప్రీంకోర్టులో ప్రత్యేకించి పిటిషన్ విచారణ అవసరం లేదు’’ అని వాదించారు.
Tags: CJI Sanjeev KhannaMahakumbh 2025PIL in Supreme CourtStampede at Kumbh





