News

పాకిస్తాన్‌ : 100 దాటిన ఘర్షణ మృతుల సంఖ్య

245views

పాకిస్తాన్‌లో షియా – సున్నీల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో మ‌ర‌ణాల సంఖ్య 100కు చేరింది. గ‌త వారం పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో షియా- సున్నీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది.

జిల్లాలోని పరాచినార్ ప్రాంతంలో 200 మంది షియా వ‌ర్గానికి చెందిన ప్ర‌యాణికులు వెళ్తున్న వాహ‌నాల‌పై మెరుపుదాడి జ‌రిగింది. అగంత‌కులు జ‌రిపిన కాల్పుల్లో భారీ ప్రాణనష్టం సంభవించిందని స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.

దీంతో నాటి నుంచి షియా – సున్నీ వ‌ర్గాల మ‌ధ్య మొద‌లైన ఘ‌ర్ష‌ణ తారాస్థాయికి చేరింది. వాహ‌నాల‌పై జ‌రిగిన దాడి త‌ర్వాత అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వ‌ర్గాల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కుదిర్చారు. అయితే, కాల్పుల విరమణ సమయంలో చెదురు మదురు ఘర్షణలు చోటు చేసుకోవడంతో మృతుల సంఖ్య 100కి పైగా దాటిందని కుర్రం జిల్లా డిప్యూటీ కమిషనర్ జావేదుల్లా మెహసూద్ మీడియాకు తెలిపారు.