News

సంభాల్ ఘర్షణలపై ఉత్తర్వులు ఇవ్వొద్దని ట్రయిల్ కోర్టుకు సుప్రీం ఆదేశం

220views

ఉత్తరప్రదేశ్ సంభాల్‌ లోని షాహి జామా మసీదు మందిరంలో సర్వే చేస్తుండగా అల్లర్లు చెలరేగిన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. శాంతి, సామరస్యాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేస్తూ, ట్రయిల్ కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా నిలిపివేసింది. మత సామరస్యానికి శాంతి కమిటీలు పాటుపడాలని, అన్ని పార్టీలు సంయమనం పాటించాలని సీజైఐ సంజీవ్ ఖాన్నా సారథ్యంలోని ధర్మాసనం కోరింది. తదుపరి విచారణను 2005 జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.

పదహారవ శతాబ్దానికి చెందిన మసీదు స్థానంలో హిందూ ఆలయం ఉందని కొందరు హిందూ పిటిషనర్లు ట్రయిల్ కోర్టును ఆశ్రయించడంతో అందుకు విచారణ కోర్టు అంగీకరించింది. మసీదును సర్వే చేయాలంటూ నవంబర్ 19న దిగువ కోర్టు ఆదేశాలిచ్చింది. దీనిని షాహి జామా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సర్వేతో ఉద్రిక్తతలు పెరగడం, శాంతి భద్రతల విఘాతానికి దారితీయవచ్చని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సర్వేను ఆపమని సుప్రీంకోర్టు ఆదేశించనప్పటికీ సీల్డ్ కవర్‌లో నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా శాంతిని ఎట్టిపరిస్థితుల్లోనైనా కాపాడాల్సిన అవసరం ఉందని సీజేఐ స్పష్టంగా తెలిపారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీనిపై హైకోర్టు పరిష్కారం చెప్పేంతవరకూ తదుపరి చర్యలు తీసుకోవాలని విచారణ కోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది. ట్రయిల్ కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించాలని సంభాల్ జామా మసీదు మేనేజిమెంట్ కమిటీని ఆదేశించింది.

షాహి జామా మసీదు సర్వే జరుగుతుండగా నవంబర్ 24న రాళ్లు రువ్వుడు, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నారు. ఈ ఘర్షణల్లో నలుగురు మృతి చెదగా, పోలీసు సిబ్బందితో సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ అరోరా సారథ్యంలో త్రిసభ్య జ్యుడిషియల్ విచారణకు యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆదేశించారు.

సంబాల్ అ్లలర్ల నేపథ్యంలో శుక్రవారం ప్రార్ధనలు సందర్భంగా సంభాల్, మొరాదాబాద్ డివిజన్‌లో భారీ భద్రతా బలగాలను రాష్ట్ర ప్రభుత్వం మోహరించింది. త్వరతగతిన శాంతి నెలకొనేందుకు స్థానిక ముస్లిం నేతలతో అధికారులు సమావేశం జరుపుతున్నారు. ప్రజలు స్థానిక మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవాలని, సామరస్యాన్ని పాటించాలని సిటీ క్వాజీ పిలుపునిచ్చారు.