
బాలీవుడ్ వివాదాస్పద నటి, మహిళల హక్కులపై గళమెత్తే స్వరభాస్కర్ పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆమె చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం లేదని, ఆమె డబుల్ స్టాండర్డ్స్ మెయింటెన్ చేస్తోందని విమర్శిస్తున్నారు. తన భర్త, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అయిన ఫహద్ అహ్మద్ తో కలిసి ముస్లిం మత పెద్ద మౌలనా సజ్జద్ నోమానీని స్వర భాస్కర్ కలిసింది. ఆ సమయంలో ఆమె పూర్తిగా ముస్లిం మహిళ తరహాలో తలపై దుపట్టా కప్పుకుని ఉంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ట్రోలింగ్ ప్రారంభించారు.
ముస్లిం మత పెద్ద అయిన మౌలనా సజ్జద్ నోమానీ ఛాందస వాది. తాలిబన్ల సానుభూతిపరుడైన మౌలానా ఆడ పిల్లలు చదువుకోవడం పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అలాగే వివాహానికి ముందు మహిళలు ఎవరితోనూ శారీరక సంబంధాలు పెట్టుకోకూడదని వ్యాఖ్యానించారు. మౌలనా భావాలకు పూర్తి వ్యతిరేకంగా, ఫెమినిస్ట్ అయిన స్వర భాస్కర్ పోస్ట్లు చేస్తూ ఉంటుంది. మహిళల హక్కుల విషయంలో హద్దు దాటి మరీ వ్యాఖ్యలు చేసి వివాదాలు సృష్టిస్తుంది. అలాంటి స్వర భాస్కర్ ముస్లిం ఛాందస వాది అయిన మౌలనాను కలవడం, తాను చెప్పే మాటలకు వ్యతిరేకంగా దుస్తులు ధరించడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు.
“అల్ట్రా ఫెమినిస్ట్ స్వర భాస్కర్. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? తాలిబన్లకు అనుకూలంగా మాట్లాడే, ఆడపిల్లలను ఇంటికే పరిమితం చేయాలనే మౌలనానకు కలవడం ఏంటి“, “మీరు ఎవరిని కలవాలనుకుంటారో, ఎవరి ఆశీర్వాదాలు తీసుకోవాలనుకుంటారో మీ ఇష్టం. కానీ, ఇకపై మహిళల హక్కుల గురించి నీతులు చెప్పకండి“, “మహిళల హక్కుల గురించి గొంతు చించుకుని మాట్లాడే స్వరభాస్కర్ తన భావాలకు వ్యతిరేకమైన వ్యక్తి దగ్గరకు వెళ్లి గర్వంగా ఫొటో తీసుకుంది“ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.





