
హిందూ దేవాలయాల విముక్తి పోరాటంలో భాగంగా జనవరి 5, 2025న నిర్వహించనున్న ‘చలో విజయవాడ’లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చింది. ‘హైందవ శంఖారావం’ నినాదంతో, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర విభాగం ఆదివారం 26 జిల్లాల్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. దేవాలయాలను ప్రభుత్వీకరణ కాదు, హిందూ సమాజీకరణ చేయడం నేటి అవసరం అనే సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి మూలకు వ్యాప్తి చేసే భాగంలో ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేవాలయాల నిర్వహణలో రాష్ట్ర జోక్యం చేసుకోకుండా, తమ నియంత్రణను ధార్మిక సంస్థకు అప్పగించాల్సిన అవసరాన్ని హిందువులు గుర్తించాలని ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వక్తలు కోరారు. తిరుమల కల్తీ నెయ్యి వివాదాన్ని ఊటంకిస్తూ, దేవాలయాల పవిత్రత పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించేవారు పరిపాలన సాగిస్తే హిందూ మనోభావాలు గాయపడే దుస్సంఘటనలు తప్పవని విశ్వహిందూ పరిషత్ నేతలు అన్నారు.
దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం చెలాయించడం భారత రాజ్యాంగంలోని 12, 25, 26 అధికరణలను ఉల్లంఘించడమేనని, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ హిందూ పుణ్యక్షేత్రాలు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ఉన్నాయని విహెచ్పి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలల్లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సహా హిందూ ధర్మాన్ని అనుసరించే వ్యక్తులను మాత్రమే ఉద్యోగులుగా నియమించాలని విహెచ్పి నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే, ఆలయ ట్రస్ట్ బోర్డులలో రాజకీయ రహిత వ్యక్తులను నామినేట్ చేయాలని మరియు దేవాలయాల నుండి వచ్చే ఆదాయాన్ని హిందూ ధర్మ ప్రచారానికి మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించాలన్నారు. ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు ప్రభుత్వ ఖజానాకు మళ్లించవద్దని స్పష్టం చేశారు.
2025 జనవరి 5న విజయవాడలో నిర్వహించే హైందవ శంఖారావం బహిరంగ సభకు పెద్ద ఎత్తున హిందువులు తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.





