News

అయోధ్య: ఆ మట్టి ప్రమిదలను ఏం చేస్తారంటే..

220views

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బుధవారం అత్యంత వేడుకగా దీపోత్సవం జరిగింది. 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించి యోగి ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది.

దీపావళి సందర్భంగా గత ఎనిమిదేళ్లుగా దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీపోత్సవ వేళ నగరం వినూత్న కాంతులతో నిండిపోతుంది. అయితే దీపోత్సవం సందర్భంగా దీపాలు వెలిగించిన తర్వాత ఆ ‍ప్రమిదలను ఏమి చేస్తారు? ఈ ప్రశ్న అందరిమదిలో మెదులుతుంది.

గత ఎనిమిది ఏళ్లుగా అయోధ్యలో లక్షలాది దీపాలు వెలిగిస్తున్నారు. తొలిసారి జరిగిన ఈ వేడుకల్లో లక్షకు పైగా దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఏటా ఈ సంఖ్యను పెంచుతూ నిన్న జరిగిన ఎనిమిదో దీపోత్సవంలో 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దీనిని వరల్డ్ రికార్డ్స్ బృందం లెక్కించి సర్టిఫికేట్ జారీ చేయనుంది.

ఈ లెక్కింపు అనంతరం అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ దీపాల ప్రమిదిలను అక్కడి నుంచి తొలగించనున్నారు. అవధ్ యూనివర్సిటీ మీడియా ఇన్‌ఛార్జ్ డాక్టర్ చతుర్వేది మీడియాతో మాట్లాడుతూ దీపోత్సవం అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ బృందం అన్ని ఘాట్‌లను శుభ్రం చేసి,ఆ ప్రమిదలనన్నింటినీ సేకరించి, ఒక చోటచేర్చి, ఆ తర్వాత పారవేస్తుందని తెలిపారు.