News

ఆలయ గర్భగుడిలో పూజల వివాదం : అధికారిపై వేటు

287views

ద్వాదశ జ్యోతిర్లాంగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలో పూజలు చేసి వివాదంలో చిక్కుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే వ్యవహారంలో ఆలయ నిర్వహకులు చర్యలు తీసుకున్నారు. దర్శనం ఏర్పాట్లను పర్యవేక్షించే అధికారిని విధుల నుంచి తొలగించారు. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశంపై ఏడాదిగా నిషేధం అమలులో ఉంది. కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ శ్రీకాంత్ షిండే అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం తన భార్య, మరో ఇద్దరితో కలిసి ఆలయ గర్భగుడిలో పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు చర్యలకు దిగారు.

”దర్శనం ఏర్పాట్లు చూసే ఇన్‌చార్జి వినోద్ చౌక్సేను విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా విధుల నుంచి తొలగించాం. ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి షోకాజ్ నోటీసులు పంపాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని కఠినమైన ఆదేశాలిచ్చాం” అని ఆలయ నిర్వాహకులు తెలిపారు. గర్భగుడిలో ఏ ఒక్కరికీ ప్రవేశానికి అనుమతి లేదని ఆలయ కమిటీ చైర్మన్, ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ కుమార్ చెప్పారు. జరిగిన ఘటనను అనధికారికంగా జరిగిన ఎంట్రీగా పేర్కొన్నారు. తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్‌ను ఆదేశించామని తెలిపారు.