
తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అడిషనల్ ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరి ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి టీటీడీ, విజిలెన్స్ పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్పై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఈఓ మాట్లాడుతూ తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీటీడీ, విజిలెన్స్ పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్, ఏపీఎస్ ఆర్టీసీ, టీటీడీ ఇంజినీరింగ్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ జీఎంలు కమిటీగా ఏర్పడి వారం రోజుల్లోపు సమస్యలను గుర్తించి పరిష్కారానికి సలహాలు, సూచనలు అందివ్వాలన్నారు.





