
258views
ఉమ్మడి పౌర స్మృతి, జమిలి ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. లోక్సభ, శాసనసభలకు ఒకేసారి, పంచాయితీలకు నెల రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించడం అవసరమని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు సకాలంలో పంచాయితీ ఎన్నికలను నిర్వహించడం లేదన్న ఆయన ఈ ఎన్నికలను తప్పనిసరి చేయాలన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. జమిలి ఎన్నికలను వ్యతిరేకించేందుకు రాజకీయ కారణాలు ఏవీ లేవన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే ఓటర్ల జాబితా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మాటిమాటికీ ఎన్నికల నిర్వహణ వల్ల భారీ వ్యయం భరించాల్సి ఉండడం, ప్రవర్తనా నియమావళి వల్ల అభివృద్ది కుంటుపడడం వంటి సమస్యలు జమిలి వల్ల తొలగి సుస్థిరత ఏర్పడుతుందన్నారు. జమిలి ఎన్నికల వల్ల ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్న అభిప్రాయంతో తాను ఏకీభవించనన్నారు.





