ArticlesNews

ప్రజల రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం

273views

( అక్టోబర్ 15 -అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ జయంతి )

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ అక్టోబర్ 15, 1931న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఆయన భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి.

ఆయన పుట్టినరోజు అక్టోబరు 15. ఈ సందర్భంగా వారిని ఓసారి గుర్తు చేసుకుంటూ….. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు. భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్‌గా పనిచేశారు.
భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రేస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పైన గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు.

అవుల్ పకీర్ జైనులబ్ధీన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15న జన్మించారు. తండ్రి జైనులబ్ధీన్, పడవ యజమాని మరియు తల్లి ఆషియమ్మ, గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా ఏ.పి.ఙే.అబ్దుల్ కలామ్ తోడ్పడటానికి న్యూస్ పేపర్ పంపిణీ చేసేవారు.

పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవారు మరియు ఎక్కువ సమయం కష్టపడేవారు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి చేరి, 1954లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు.

1969లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో(ఇస్రో) చేరి, ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం(SLV-III) ప్రయోగానికి డైరెక్టర్‌గా పనిచేసి జూలై 1980లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 1970 మరియు 1990 మధ్య కాలంలో, కలాం పోలార్ SLV మరియు SLV-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్టులు విజయవంతం అయినాయి. 1970లలో స్థానికంగా తయారైన SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. జూలై 1992 నుండి డిసెంబరు 1999 మధ్య ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్లో-II అణు పరీక్షలలో కలాం రాజకీయ మరియు సాంకేతిక పాత్ర నిర్వహించారు.

భారత దేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ (1981లో); పద్మ విభూషణ్ (1990లో); మరియు భారత రత్న (1997లో) లతో పాటు నలభై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డా. కలామ్. జూలై 18, 2002న కలామ్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో (90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న పదవీ స్వీకారం చేశారు. ఆయన్ను ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ NDA.

ఆయన భారతదేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం వ్రాశారు.

రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్‌ కలాం జూలై 27, 2015 సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యారు. షిల్లాంగ్‌లోని ఏఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ అబ్దుల్‌ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్‌ కలాంను స్థానిక బెథాని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు.