
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికాకు చెందిన మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు గురువారం విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) చేరుకున్నారు. వీరిని రోదసిలోకి తీసుకెళ్లిన స్టార్లైనర్ వ్యోమనౌక గురువారం రాత్రి అంతరిక్ష కేంద్రంతో క్షేమంగా అనుసంధానమైంది. బోయింగ్ సంస్థ రూపొందించిన ఈ క్యాప్సూల్కు ఇది తొలి మానవసహిత యాత్ర. అంతకుముందు హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్ -కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఇది ఐఎస్ఎస్తో అనుసంధానం కాగలిగింది. ఆ సమయంలో ఈ అంతరిక్ష కేంద్రం.. దక్షిణ హిందూ మహాసముద్రానికి ఎగువన 400 కిలోమీటర్ల ఎత్తులో విహరిస్తోంది. ఐఎస్ఎస్కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్మోర్లు కొద్దిసేపు పరీక్షించారు. మార్గమధ్యంలోనూ ఈ క్యాప్సూల్ను హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్ ప్రతినిధి తెలిపారు. వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని చెప్పారు.





