News

ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు

254views

విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి నిత్యం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. చివరి రోజు అమ్మవారికి అన్ని రకాల పుష్పాలతో అర్చన చేశారు. దేవస్థాన యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగిసాయి. అమ్మవారికి అర్చన నిర్వహించే పుష్పాలతో ఆలయ ఈవో కెఎస్‌.రామరావు దంపతులు, స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ఏఈవో రమేష్‌బాబు, ఇతర అధికారులు ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకున్నారు. పుష్పార్చన వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తులకు పుష్పాలను పంపిణీ చేశారు. యాగశాలలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణ మూర్తి, రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షణలో పూర్ణాహుతి నిర్వహించారు.