
పశ్చిమ బెంగాల్లోని శిలిగుడి సఫారీ పార్కులోని సింహాలకు సీత, అక్బర్ పేర్లు పెట్టడాన్ని కలకత్తా హైకోర్టు తప్పు పట్టింది. అనవసర వివాదాలు ఎందుకు సృష్టిస్తారని ప్రశ్నించింది. ‘‘మీరు పెంచుకుంటున్న జంతువులకు హిందూ దేవుడు, ముస్లిం ప్రవక్త పేరు పెడతారా..? అక్బర్, సీత అంటూ పిలవడమేంటి? ఒక జంతువుకు రవీంద్రనాథ్ ఠాకూర్ పేరును ఊహించగలమా..! ఈ దేశంలో సీతను ఎంతో మంది పూజిస్తారు. సింహానికి అక్బర్ పేరు పెట్టడాన్ని కూడా వ్యతిరేకిస్తాను అని న్యాయమూర్తి జస్టిస్ సౌగత్ భట్టాచర్య గురువారం రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సింహాలకు వేరే పేర్లు పెట్టాలని సూచించారు. ఈ పిటిషన్ను విశ్వహిందూ పరిషత్ వేసింది. ఆడ సింహానికి సీత పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సింహాలు త్రిపుర నుంచి వచ్చాయని, అప్పటికే ఆ పేర్లు ఉన్నాయని, వాటిని మారుస్తామని న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు.





