
అయోధ్యకు భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రోజు నుంచి సామాన్య భక్తులు స్వామిని లక్షల సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ప్రతీరోజు లక్షల్లో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు.
జనవరి 22 నుంచి ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల మంది రామభక్తులు రామ్లల్లాను దర్శించుకున్నట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆలయప్రారంభ తర్వాత మొదటి 10 రోజుల్లో 25 లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు.
రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు కూడా రాముడి దర్శనం కోసం క్యూ కడుతున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంతమాన్ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 11న 300 ఎమ్మెల్యేలతో కలిసి అయోధ్య రాముడికి పూజలు చేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా మంత్రివర్గంతో కలిసి శ్రీరాముడిని దర్శించుకున్నారు.
అయోధ్య ఆధ్మాతిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాముడి కరుణా కటాక్షాలతో తమ జీవితాలు మెరుగుపడ్డాయని తమ అనుభవాలు చెబుతున్నారు. ఒకప్పుడు ఉపాధి కోసం వలసపోవాల్సిన పరిస్థితి ఉండేదని రామాలయ నిర్మాణంతో తమ ఆదాయం పెరిగి సొంత ప్రాంతంలోనే భూమి కొనుక్కునే స్థాయికి ఎదిగామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తమ నివాసంలో ఓ భాగాన్ని గతంలో నెలకు రూ. 3 వేలకు అద్దెకు ఇచ్చేవాడినని, ప్రస్తుతం రోజుకు మూడు వేల రూపాయల అద్దె రావడంతో తన ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలిగిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ప్రతీరోజు ఓ కొత్త అతిథి వస్తుండటంతో తన ఆదాయానికి డోకా లేకుండా ఉందంటున్నాడు. భక్తుల తాకిడి పెరగడంతో స్థానికులంతా తమ నివాసాల్లోని ఓ భాగాన్ని వసతి గృహంగా మార్చి అద్దెకు ఇస్తున్నారు. తద్వారా వారి జీవనం మెరుగుపడింది. అలాగే దుకాణాలు కూడా వినియోగదారుల కొనుగోళ్ళతో కళకళలాడుతున్నాయి.
పూజా సామగ్రి దుకాణాలు, మొబైల్ స్టోర్లు, ట్రావెల్ ఎజెన్సీలు, బట్టల షాపుల, ఫుట్ వేర్ దుకాణాల వ్యాపారం రెట్టింపు అయింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయ నిర్మాణం పూర్తి అయితే పర్యాటకుల సంఖ్య మరింత పెరగడంతో పాటు అందుకు తగ్గట్టుగా తమ ఆదాయం పెరుగుతుందనడంలో సందేహం లేదని భక్తులు చెబుతున్నారు.





