News

గగన్‌యాన్‌ మిషన్‌లో మరో ఘనత సాధించిన ఇస్రో

190views

భారత్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్‌ మిషన్‌లో మరో ముందడుగు పడింది. గగన్‌యాన్‌ ప్రయోగంలో భాగంలో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడే ఎల్‌వీఎం3 లాంచ్‌ వెహికల్‌ తయారీలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఈ లాంచ్‌ వెహికల్‌కు గుండెకాయ లాంటి ‘సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌’ను విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఇస్రో బుధవారం వెల్లడించింది.

తమ పరీక్షలో క్రయోజనిక్‌ ఇంజన్‌ పూర్తి సంతృప్తికరమైన పనితీరు కనబర్చిందని, అంతరిక్ష యాత్రలకు అర్హత సాధించిందని వెల్లడించింది. గగన్‌యాన్‌ యాత్రకు ఈ ఇంజన్‌ అనువైందని తేలినట్లు స్పష్టం చేసింది. పలు రకాల కఠిన పరీక్షల తర్వాత ఈ క్రయోజనిక్‌ ఇంజిన్‌ భద్రతా ప్రమాణపత్రాన్ని పొందిందని పేర్కొంది. మానవ రహిత గగన్‌యాన్‌–1 యాత్రను 2024లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగం సఫలమైతే మానవ సహిత యాత్ర చేపట్టనున్నారు.

ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేర్చి, మళ్లీ క్షేమంగా వెనక్కి తీసుకురావడం గగన్‌యాన్‌ మిషన్‌ లక్ష్యం. మొత్తం మూడు రోజుల్లో ప్రయోగం పూర్తవుతుంది. ఈ ప్రయోగంలో వ్యోమగాములను ఎల్‌వీఎం3 లాంచ్‌ వెహికల్‌లో అంతరిక్షంలోకి చేర్చాలని నిర్ణయించారు. ఇందులో ఘన, ద్రవ, క్రయోజనిక్‌ దశలు ఉంటాయి.

ఈ క్రయోజనిక్‌ దశలో లాంచ్‌ వెహికల్‌ను గమ్యస్థానానికి చేర్చడంలో సీఈ20 ఇంజిన్‌ పాత్ర అత్యంత కీలకం. ఈ ఇంజన్‌పై ఏడో వాక్యూమ్‌ టెస్టును ఈ నెల 14న తమిళనాడు మహేంద్రగిరిలోని హై ఆలి్టట్యూడ్‌ టెస్ట్‌ ఫెసిలిటీలో నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది. గగన్‌యాన్‌ మిషన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించామని బుధవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ యాక్సెపె్టన్స్‌ టెస్టులు, ఫైర్‌ టెస్టులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి.