News

శ్రీముఖలింగం అష్టతీర్థాల అభివృద్ధికి మోక్షమెప్పుడో?

279views

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీముఖలింగంలోని అష్టతీర్థ ఘట్టాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. దక్షిణ కాశీగా పిలువబడే ఈ క్షేత్రంలో 2017 జులైలో ఎనిమిది రోజుల పాటు వైభవంగా నిర్వహించిన అష్టతీర్థ రాజమహాయోగం నిర్వహించారు. ఆ ఉత్సవాలు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి సైతం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎనిమిది తీర్థ ఘట్టాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. అప్పట్లో స్నానఘట్టాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.36 లక్షలు మేర ఖర్చు చేసింది. ఉత్సవాల అనంతరం వాటిని గాలికొదిలేశారు. కాలక్రమేణా అవి రూపురేఖలు కోల్పోయాయి. ప్రస్తుతం శ్రీముఖలింగేశ్వరుడిని దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నవారంతా తీర్థ ఘట్టాలు చూసి నివ్వెరపోతున్నారు. క్షేతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
ఎక్కడికక్కడ ఇదీ పరిస్థితి..

  • బిందుతీర్థం(పులిబంద చెరువు): శ్రీముఖలింగం గ్రామానికి ఉత్తర ముఖంలో ఈ తీర్థ ఘట్టం ఉంది. 1.31 ఎకరాల ఉన్న ఈ చెరువు అభివృద్ధికి రూ.4 లక్షలు ఖర్చు చేశారు. అనంతరం పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం పనికిరాని మొక్కలతో నిండిపోయింది.
  • గయాతీర్థం(పురాబత్తుల చెరువు): ఇది శ్రీముఖలింగం గ్రామానికి కొద్ది దూరంలో పద్మనాభగిరి కొండకు సమీపంలో ఉంది. గతంతో రూ.6 లక్షలతో పనులు చేశారు. ప్రస్తుతం అనుపురం గ్రామస్థులు స్నానాలకు వినియోగించుకుంటున్నారు. స్థానికులు మినహా ఇతర భక్తులు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
  • హంస తీర్థం(వంశధార నది ఘాట్‌): ప్రధాన ఆలయానికి వెనుక భాగంలో వంశధార నదీ తీరంలో ఇది ఉంది. కార్తికమాసంతో పాటు మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో ఎంతో మంది ఇక్కడే పుణ్యస్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటారు. దీని పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి.
  • పిశాచమోచన (జోడుబందల చెరువు): ఈ తీర్థ ఘట్టం నగిరికటకం సమీపంలోని రహదారికి ఆనుకుని ఉంది. గతంలో రూ.3 లక్షలు ఖర్చు చేసి ఈ చెరువును బాగు చేశారు. ఆ తరువాత అటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ప్రస్తుతం పనికిరాని మొక్కలతో నిండుగా దర్శనమిస్తుంది.
  • పక్షిమోచన (జీలుగుబంద): ఈ చెరువు అభివృద్ధికి గతంలో చేసిన రూ.4 లక్షల ఖర్చు వృథాగా మారింది. ఇది క్షేత్రానికి దూరంగా ఉండటంతో పట్టించుకునేవారే లేకుండా పోయారు.
  • జంబు (నేరేడుబంద): శ్రీముఖలింగం గ్రామానికి ఉత్తరముఖంగా ఉన్న ఈ ఘట్టం ప్రస్తుతం పనికిరాని మొక్కలతో నిండిపోయింది. అయినప్పటికీ అక్కడే భక్తులు స్నానాలు చేయాల్సి వస్తోంది.
  • సూర్య(వంశధార నది ఘాట్‌): స్థానిక పండా వీధి గుండా వెళ్లే మార్గంలో వంశధార నదిలో ఈ ఘాట్‌ ఉంది. దీని అభివృద్ధికి రూ.1.60 లక్షలు మంజూరైనప్పటికీ సమయాభావంతో అప్పట్లో పనులు చేపట్ట లేదు.
  • సోమ (ఎన్టీఆర్‌ ఘాట్‌): ఇక్కడ ఎక్కువగా పితృదేవతలకు పిండప్రదానాలు చేస్తుంటారు. నది లోపలకు వెళ్లే మార్గం అధ్వానంగా ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు.
  • అప్పుడు బాగానే ఉండేది…
    మేము అష్టతీర్థ రాజమహాయోగం జరిగిన సమయంలో మూడో రోజు పుణ్యస్నానం ఆచరించాం. అన్ని తీర్థ ఘట్టాలను చూశాం. ఆ రోజుల్లో భక్తులతో తీర్థ ఘట్టాలన్నీ కిటకిటలాడాయి. పరిసరాలు కూడా శుభ్రంగా కనిపించాయి. ఇప్పుడు స్వామి దర్శనానికి వచ్చి చూస్తే తీర్థఘట్టాలు పనికిరాని మొక్కలతో నిండిపోయాయి. అధికారులు క్షేత్రం అభివృద్ధిపై దృష్టి సారిస్తే బాగుంటుంది.
    -మీనాక్షి, భక్తురాలు, విశాఖపట్నం

    ప్రతిపాదనలు పంపించాం..
    శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రం బృహత్‌ ప్రణాళికలో భాగంగా అష్టతీర్థ ఘట్టాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఆ మేరకు రూ.55 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరైన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం.– పి.ప్రభాకరరావు, ఆలయ ఈవో, శ్రీముఖలింగం