
హైదరాబాద్లోని సుల్తాన్బజార్, వైఎంసీఏ, ఆర్టీసీ క్రాస్రోడ్స్, ముషీరాబాద్ మీదుగా తాడ్బండ్ ఆలయానికి హనుమాన్ జయంతి యాత్ర చేరుకుంది. రంజాన్ మాసం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు దారిపొడవునా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా సీపీ కెమెరాల నిఘా ఉంచారు. భక్తులకు ఆయా సంఘాలు, స్వచ్ఛందసంస్థలు అల్పహారం, మజ్జిగ వితరణ చేశాయి. యాత్ర నేపథ్యంలో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్…
హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరుతుండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కడికి వెళ్లినా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనపై కేసుల మీద కేసులు నమోదవుతున్నా కూడా రాజాసింగ్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో గురువారంనాటి హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఆయన మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారేమోనని పోలీసులు ముందుగానే రాజాసింగ్ను అదుపులోకి తీసుకున్నారు.





