News

మహిళలకు ప్రవేశం ఎందుకు ఉండకూడదు? : కేంద్రానికి సుప్రీం నోటీసులు

762views

ఢిల్లీ: ముస్లిం మహిళలు మసీదుల్లోకి ప్రవేశింపరాదని మతపరంగా ఎక్కడైనా ప్రస్తావించారా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మహిళలు మసీదులో ప్రవేశించి నమాజు చేసేలా అనుమతి కల్పించాలంటూ దాఖలైన పిల్‌ను అత్యున్నతం న్యాయంస్థానం విచారించింది.

ప్రార్థనాలయాల్లోకి మహిళలు ప్రవేశించాలంటే ఒకరి అనుమతి తీసుకోవాలా..?

మహిళలను మసీదులోకి అనుమతించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15,21,25,29లను ఉల్లంఘించినట్లు అవుతుందని కోర్టు తెలిపింది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ కోరుతూ కేంద్ర ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మహిళలను మసీదులోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్‌ను మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేసింది. జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌ను విచారణ చేసింది. ఈ సందర్భంగా శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. మసీదులోకి, ఆలయంలోకి, చర్చిలోకి ప్రవేశించాలంటే ఒకరి అనుమతి ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించింది. ఇక్కడే రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని పేర్కొంది.

ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది:

ఈ పిల్‌ను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన యస్మీన్, జుబేర్ దంపతులు దాఖలు చేశారు.మసీదుకి మహిళలకు ప్రవేశం కల్పించి నమాజ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఇలా మహిళలను మసీదులోకి అనుమతించకపోవడమంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కును ఉల్లంఘించినట్లు అవుతుందని పిల్‌లో పేర్కొన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌లో కూడా మహిళలను మసీదుల్లోకి అనుమతించకూడదని ఎక్కడా పేర్కొనబడలేదని తెలిపారు. ఇది మహిళల మనోభావాలను కించపరచడమే కాదు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కూడా అవుతుందని వారి తరుపున లాయర్ అశుతోష్ దూబే అన్నారు. మహిళలకు పురుషులకు సమాన హక్కులు కలిగి ఉన్నారని అశుతోష్ దూబే అన్నారు.

శబరిమల ఆలయం పై ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన సుప్రీం కోర్టు:

ప్రస్తుతం జమాత్-ఈ-ఇస్లామి మరియు ముజాహిద్ వర్గాలకు చెందిన మహిళలకు మాత్రమే మసీదులో నమాజ్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే సున్నీ వర్గం వీరు నమాజ్ చేసేందుకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఒకవేళ మహిళలను మసీదుల్లోకి అనుమతించినప్పటికీ పురుషులకు మహిళలకు వేర్వేరు ప్రవేశద్వారాలు పెడుతున్నారని పిల్‌లో పేర్కొన్నారు. వారి వాదనకు బలం చేకూర్చేందుకు ఈ మధ్య సుప్రీంకోర్టు శబరిమలై తీర్పును ప్రస్తావించారు. విచారణ చేసిన సుప్రీం కోర్టు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం.